
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ సిప్లాలో ప్రమోటర్లకు ఉన్న మొత్తం వాటా 33.47 శాతాన్ని ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ బ్లాక్స్టోన్ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు శుక్రవారం 6 శాతం పెరిగి రికార్డ్ హై అయిన 1,239 ని టచ్ చేశాయి. కంపెనీలోని హమీద్ ఫ్యామిలీ వాటాను కొనుగోలు చేయడానికి నాన్ బైండింగ్ బిడ్ను బ్లాక్స్టోన్ వచ్చే వారం ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఈ డీల్ పూర్తయితే అదనంగా మరో 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి కంపెనీ ఓపెన్ ఆఫర్ను కూడా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. సిప్లాలో 59.4 శాతం వాటాను దక్కించుకునే ఆలోచనలో బ్లాక్స్టోన్ ఉందని అన్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఒక ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ కుదుర్చుకున్న అతిపెద్ద డీల్గా ఇది నిలవనుంది. ఇతర పార్టనర్లతో కలిసి బ్లాక్స్టోన్ కన్సార్టియంను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది జూన్తో ముగిసిన క్వార్టర్లో సిప్లాకు రూ.996 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన ప్రాఫిట్తో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. ఆపరేషనల్ రెవెన్యూ 18 శాతం పెరిగి రూ.6,329 కోట్లకు ఎగిసింది. జనరిక్, బ్రాండెడ్ ప్రిస్క్రిప్షన్లలో సిప్లా మంచి గ్రోత్ నమోదు చేసింది. కంపెనీ యూఎస్ బిజినెస్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 43 శాతం పెరిగి 222 మిలియన్ డాలర్లకు చేరుకుంది. రిజల్ట్స్ వెలువడిన తర్వాత కంపెనీ షేరు టార్గెట్ ధరను జెఫరీస్ రూ.1,210 గా నిర్ణయించిన విషయం తెలిసిందే.