హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీ మళ్లీ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ వల్ల విద్యా సంస్థలు ఎక్కడ బంద్ అవుతాయోనన్న ఆలోచనతో మేనేజ్మెంట్లు బలవంతపు వసూళ్లకు దిగుతున్నాయి. అకడమిక్ ఇయర్ మొత్తం ఫీజు ఒకేసారి కట్టాలంటూ స్టూడెంట్లను, వారి తల్లిదండ్రులను సతాయిస్తున్నాయి. ఫీజులు కట్టకుంటే స్టూడెంట్లను ఇంటర్నల్ పరీక్షలకు అనుమతించడం లేదు. నెలవారీగా తీసుకోవాల్సిన ఫీజులను ఒకేసారి కట్టాలంటే పైసలు ఎక్కడి నుంచి తేవాలని, కరోనా వల్ల నిరుడు మార్చి నుంచి ఆర్థికంగా చితికిపోయామని పేరెంట్స్ అంటున్నారు.
జీవో ఉన్నా.. ఫాయిదా లేదు
రాష్ట్రంలో 10,491 కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు.. 1,500 ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 40 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. స్కూళ్లలో ఏటా రూ. 10 వేల నుంచి 5 లక్షల దాకా, కాలేజీల్లో రూ. 25 వేల నుంచి 10 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తుంటారు. అడ్మిషన్, స్పెషల్, డెవలప్మెంట్ ఫీజులంటూ ఇష్టమున్నట్లు రాబడుతుంటారు. 2020–21 అకడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే ఆ ఏడాదికి ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం జీవో నంబర్ 46 రిలీజ్ చేసింది. ఫీజులు పెంచొద్దని, మొత్తం ఫీజు ఒకేసారి తీసుకోవద్దని, ట్యూషన్ ఫీజును మాత్రమే నెలనెలా తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చింది. దీనికి అనుబంధంగానే ఈ ఏడాది కూడా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మేనేజ్మెంట్లు పట్టించుకోవడం లేదు.
మూతపడ్తాయన్న ఉద్దేశంతో..!
కరోనా వల్ల ఏడాదిపాటు విద్యా సంస్థలు సరిగ్గా నడవలేదు. సెకండ్ వేవ్ తర్వాత సెప్టెంబర్లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు బయటపడుతుండటంతో మళ్లీ ఎక్కడ స్కూళ్లు, కాలేజీలు మూతపడుతాయోనన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్లు ఫీజుల వసూళ్లపై ఫోకస్ పెట్టాయి. మొత్తం ఫీజులు చెల్లించాలని పేరెంట్స్పై ఒత్తిడి తెస్తున్నాయి. మేనేజ్మెంట్ స్టాఫ్ రోజూ స్టూడెంట్ల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి చెల్లించాల్సిదేనని బలవంతం చేస్తున్నారు. పేమెంట్స్ చేయని స్టూడెంట్స్కు ఇంటర్నల్స్, ఇతర పరీక్షలకు అనుమతి ఇవ్వడంలేదు. ఫీజులు కట్టలేదని స్టూడెంట్స్ను బయట నిలబెడుతున్నారు. ఒకేసారి ఫీజులు కట్టాలంటూ బలవంతం చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని స్టూడెంట్ల తల్లిదండ్రులు అంటున్నారు.
ఫీజు కోసం బయట నిలబెడుతున్రు
మా అమ్మాయి హైదరాబాద్ కుంట్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నది. కొన్నిరోజుల నుంచి లెక్చరర్లు ఫోన్లు చేసి మొత్తం ఫీజు కట్టాలంటున్నరు. మా అబ్బాయి షాద్నగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నడు. స్కూల్ వాళ్లు కూడా మొత్తం ఫీజు కట్టాలని అడుగుతున్నరు. కట్టడంలేదని మా బాబును బయట నిలబెడుతున్నరు.
- నర్సింహులు, పేరెంట్, షాద్నగర్
ఫీజు కోసం బయట నిలబెడుతున్రు
మా అమ్మాయి హైదరాబాద్ కుంట్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నది. కొన్నిరోజుల నుంచి లెక్చరర్లు ఫోన్లు చేసి మొత్తం ఫీజు కట్టాలంటున్నరు. మా అబ్బాయి షాద్నగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నడు. స్కూల్ వాళ్లు కూడా మొత్తం ఫీజు కట్టాలని అడుగుతున్నరు. కట్టడంలేదని మా బాబును బయట నిలబెడుతున్నరు.
- నర్సింహులు, పేరెంట్, షాద్నగర్
ఫీజు దోపిడీ ఆపాలి
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల మేనేజ్మెంట్లు ఇష్టమున్నట్లు వ్యవహరిస్తున్నయి. ఒమిక్రాన్ పేరు చెప్పి ఫీజులు గుంజుతున్నయి. మొత్తం ఒక్కసారే చెల్లించాలని ఫోన్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నయి. ప్రభుత్వం స్పందించి ఫీజు దోపిడీని అరికట్టాలి.
- ప్రవీణ్ కుమార్, బీజేవైఎం నేత
ఒక్కసారి ఏడి నుంచి తేవాలె
మా అబ్బాయి గుర్రంగూడ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ చదువుతు న్నడు. మొదట ఆన్లైన్ క్లాస్లు చెప్పిన్రు. సెప్టెంబర్ నుంచి ఫిజికల్ క్లాసులు నడుస్తున్నయి. సిలబస్ అయిపోయిందని, మొత్తం ఫీజు కట్టాలని స్కూల్ వాళ్లు ఇబ్బందులకు గురిచేస్తున్నరు. ఒక్కసారే ఫీజు మొత్తం ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి?
- చంద్రశేఖర్, పేరెంట్, హైదరాబాద్