ప్రైవేట్ టీచర్ల అవస్థలు.. పూట గడవక ఉన్నయన్ని అమ్ముకుని..

ప్రైవేట్ టీచర్ల అవస్థలు.. పూట గడవక ఉన్నయన్ని అమ్ముకుని..
  • బంగారం, పొలాలు, జాగలు,బండ్లు అమ్ముకుంటున్నరు
  • కరోనా, లాక్​డౌన్​తో చితికిన బతుకులు
  • ‘భారత్  దేఖో’ సర్వేలో వెల్లడి
  • లాక్‌ డౌన్‌ నాటి నుంచి 85.7 శాతం టీచర్లకు నో ఇన్‌కం
  • ఇప్పటికీ ఖాళీగానే 62 శాతం మంది
  • చుట్టాలు, స్నేహితుల వద్దఅప్పులు చేసినవారు 50 శాతం
  • కిరాయిలు కూడా కట్టలేక ఇబ్బందులు
  • రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని ఆవేదన

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్​ టీచర్ల పరిస్థితి దారుణంగా మారింది. దాదాపు ఏడాదిగా జీతాల్లేక, ఎట్లా బతకాల్నో తెలియక సుమారు రెండు లక్షల మంది టీచర్లు ఆగమైతున్నరు. ఇల్లు కిరాయికి, ఈఎంఐలకు, అసలు నిత్యావసరాలకే డబ్బుల్లేక.. దొరికిన కాడ అప్పులు చేస్తున్నరు. చివరికి ఇంట్లో ఉన్న అంతో ఇంతో బంగారాన్ని కూడా అమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్నరు. పొలాలు, జాగలు అమ్ముకుంటున్నవారు కొందరైతే.. ఈఎంఐలు కట్టలేక బైకులు కూడా అమ్మేసుకుంటున్నవారు ఇంకొందరు.. దాదాపు 80 శాతానికిపైగా ప్రైవేటు టీచర్లది ఇదే దుస్థితి. కొందరు టీచర్లు చాయ్​ దుకాణాలు, కూరగాయల షాపులు పెట్టుకుంటుంటే.. మరికొందరు దొరికిన ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరి గడుపుతున్నరు. ‘భారత్ దేఖో’ అనే యూత్ ఆర్గనైజేషన్ ఇటీవల ‘బడ్జెట్ (చిన్న స్థాయి) ప్రైవేట్ స్కూళ్ల’లో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితులపై చేసిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఉన్నదంతా అమ్మేసుకొని..

బడ్జెట్ స్కూల్స్​ టీచర్ల పరిస్థితి రోజురోజుకు దీనంగా మారిపోతోంది. కిరాయి ఇండ్లలో ఉంటున్నవారు, ఉద్యోగాలను నమ్ముకుని బైక్‌, టీవీ వంటివి కొనుక్కున్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడ్తున్నారు. రెంటు కట్టలేక, ఈఎంఐలు చెల్లించలేక అవస్థ పడుతున్నారు. కొందరు ల్యాప్‌ టాప్‌లు, బైకులు అమ్ముకొని ఖర్చులు వెళ్లదీస్తున్నారు. బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు గత ఏడాది జనవరి, ఫిబ్రవరి నుంచే జీతాల్లేవు. మార్చిలో లాక్ డౌన్ వచ్చేసింది. దాంతో అప్పటివరకు రావాల్సిన జీతాలను కూడా మేనేజ్‌మెంట్లు చెల్లించలేదు.

మొత్తం ఏడాది నుంచి ఒక్క రూపాయి జీతం రాక దయనీయమైన జీవితం గడుపుతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ తో దాదాపు 90 శాతం మంది ప్రైవేట్ టీచర్లు ఉద్యోగాలు కోల్పోయి ఖాళీగా ఉంటున్నారు. ఇందులో సగానికి పైగా కిరాయి ఇండ్లలో ఉంటున్న వారే. భార్యభర్త ఇద్దరు టీచర్లుగా పనిచేస్తున్నవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాంటి ఫ్యామిలీల్లో ఇద్దరికీ జీతాల్లేక విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు.

చాలా మంది ఖాళీగానే..

రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో రెండున్నర లక్షల మంది ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు రెండు లక్షల మంది టీచర్లు లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. ఒక్క గ్రేటర్​ హైదరాబాద్ పరిధిలోనే నాలుగు వేలకుపైగా బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు ఉండగా.. అందులో 70 వేల మంది టీచర్లున్నారు. ఇప్పుడు వీరిలో 50 వేల మంది దాకా ఖాళీగా ఉండగా.. మరో 20 వేలమంది టీచర్లు నైన్త్, టెన్త్​ క్లాసులకు పాఠాలు చెప్తున్నారు. స్కూళ్ల మేనేజ్​మెంట్లు ఈ 20 వేల మందికి కూడా సగం జీతాలు, హవర్లీ బేస్డ్ జీతాలిస్తూ పని చేయించుకుంటున్నాయి. స్కూళ్లు రీఓపెన్ అయినా కూడా చాలా మేనేజ్​మెంట్లు టీచర్లకు పూర్తి జీతాలు ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల రోజంతా పని చేయించుకుని కూడా సగం జీతం మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం మొత్తం టీచర్లలో 10 శాతం మంది కూడా ఫుల్ శాలరీలు తీసుకోవడం లేదంటే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఎక్స్​పర్టులు స్పష్టం చేస్తున్నారు.

మూడు నెలల పాటు సర్వే..

హైదరాబాద్​ సిటీకి చెందిన ‘భారత్ దేఖో’అనే యూత్ ఆర్గనైజేషన్ నవంబర్ నుంచి జనవరి వరకు సిటీలోని 30 బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ల టీచర్లతో ఆన్‌‌లైన్‌‌ సర్వే కండక్ట్ చేసింది. ‘లాక్‌‌ డౌన్‌‌లో ప్రైవేటు టీచర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ప్రస్తుతం వారి ఫైనాన్షియల్​ పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తున్నారు’అన్న అంశాలపై సర్వే చేపట్టింది. ఇందులో 220 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. ఇందులో 78.6 శాతం మంది ఫిమేల్, 21.4 శాతం మేల్ టీచర్లున్నారు. సర్వేలో వారంతా తమ దుస్థితిని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు టీచర్లందరి పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు. లాక్‌‌ డౌన్‌‌లో 85.7 శాతం మంది టీచర్లకు ఎలాంటి ఇన్‌‌ కమ్‌‌ లేదని.. పూర్తిగా జీరో ఇన్‌‌ కంతో జీవితాలు వెళ్లదీశారని సర్వే గుర్తించింది. కేవలం 14.3 శాతం మంది టీచర్లకు మాత్రమే కొంతవరకు ఇన్‌‌కం లభించిందని.. అది కూడా వారు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారని తేలింది.

62శాతం మందికి జీతాల్లేవ్

సర్వే రిపోర్టు ప్రకారం.. అన్‌‌లాక్‌‌ తర్వాత స్కూళ్లు తెరిచినా 62 శాతం మంది టీచర్లకు ఉద్యోగాలు లేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక 50 శాతం మంది టీచర్లు చుట్టాలు, తెలిసినవాళ్ల దగ్గర కనీసం 30 వేలకుపైగా అప్పులు చేశారు. కొందరు పెద్ద మొత్తంలో అప్పులు చేయాల్సి వచ్చింది. బడ్జెట్‌‌ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లలో 64.3 శాతం మంది అద్దె ఇండ్లల్లో ఉంటున్నారు. వారిలో 90 శాతం మంది టీచర్లు కనీసం ఐదారు నెలల రెంట్‌‌ బాకీ పడ్డారు. వీరిలో చాలా మంది టీచర్లు నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారు. 76 శాతం మంది ఇప్పటికిప్పుడు తమకు ఏ ఉద్యోగం దొరికినా చేసేందుకు రెడీగా ఉన్నారు. గతంలో కన్నా తక్కువ జీతం వచ్చినా పరవాలేదని అంటున్నారు. ఇక 81 శాతం మంది టీచర్లకు ఎలాంటి హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ లేదు. ఏదైనా అనారోగ్యానికి గురైతే సర్కారీ దవాఖానాలే దిక్కు అన్న పరిస్థితిలో ఉన్నారు. ఆర్గనైజేషన్ మెంబర్లు ఈ సర్వేలో పాల్గొన్న టీచర్లలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి.. అరగంట పాటు మాట్లాడి, పరిస్థితి తెలుసుకున్నారు. బాధల్లో ఉన్న టీచర్లకు నిత్యావసర వస్తువులను అందజేశారు.

మా ఆర్గనైజేషన్ తరఫున 15 మంది టీమ్‌తో సర్వే చేశాం. గూగుల్ ఫార్మాట్‌లో కొన్ని క్వశ్చన్స్ తో కూడిన ఫామ్స్‌‌ ను టీచర్లకు పంపాం. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ సర్వే జరిగింది. ప్రైవేట్ టీచర్ల బాధలు, వాళ్ల సమస్యలను విన్నం. చాలా మంది నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. అప్పులు చేసి, బంగారం అమ్ముకుని బతుకుతున్నామన్నారు. మా ఆర్గనైజేషన్ తరఫున ఆన్​లైన్‌లో ఫండ్ రైజింగ్ చేశాం. కొందరు టీచర్ల ఫ్యామిలీలకు రూ.1,300 చొప్పున గూగుల్​పే చేసి గ్రోసరీ కొనుక్కొమ్మని చెప్పాం. మిగతావారికి నిర్మాణ్ అనే ఆర్గనైజేషన్ రేషన్ సాయం చేసింది. ఉద్యోగం కోల్పోయిన టీచర్లకు టెంపరరీగా ఉపాధి ఇప్పించాలని అనుకుంటున్నం. టీచర్లు ఉంటున్న కమ్యూనిటీల్లో మైక్రో స్కూళ్లు స్టార్ట్ చేయనున్నాం.

– రోమిలా (భారత్ దేఖో యూత్ ఆర్గనైజేషన్)

పొలం అమ్ముకున్న

నేను, నా భార్య ఇద్దరం ప్రైవేట్ స్కూళ్లలో హిందీ టీచర్లుగా పనిచేస్తున్నం. లాక్ డౌన్ తో ఇద్దరం ఉపాధి కోల్పోయినం. మాకు అంతకు ముందు కొన్ని నెలల జీతాలు కూడా రావాల్సి ఉండె. 29 ఏండ్లుగా టీచింగ్ ప్రొఫెషన్‌‌లో ఉన్నం.  ఇంతటి దారుణమైన బతుకును ఎప్పుడూ చూడలేదు. ఆర్థిక సమస్యలకు ఉన్న కొంచెం పొలాన్నీ అమ్మేసినం. నేను వాటర్ ప్లాంట్‌‌లో పనిచేస్తున్న. ఆ డబ్బులతోటే బతుకుతున్నం’’

– రామచంద్రయ్య
(హిందీ టీచర్, మహబూబాబాద్)

ఇంట్లోన్న ఉన్న బంగారం అమ్మి.

ప్రైవేటు టీచర్లలాంటి పరిస్థితి ఇంకెవరికి రావొద్దని కోరుకుంటున్నం. మా పట్ల ఎవరూ ఎందుకు కనికరం చూపించడంలేదో అర్థం కావట్లేదు. లాక్ డౌన్ మా బతుకులను ఆగం చేసింది. స్కూల్ నడిచినప్పుడే చాలీచాలని జీతాలతో బతికేవాళ్లం. ఇప్పుడు అవీ లేవు. ఇంటి కిరాయి కట్టలేక, ఫ్యామిలీని పోషించలేక చస్తూ బతకాల్సి వస్తోంది. చిన్న చిన్న అవసరాలకు ఇంట్లోని కొంచెం బంగారం కూడా అమ్మేశాను.

– శివరాజ్
(ప్రైవేట్ టీచర్, టీపీటీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్)

బైక్ అమ్మేసుకున్న

6 నెలల నుంచి ఇంటి రెంటు కట్టలేదు.  ఒకప్పుడు నెలకు 40 వేల జీతమొచ్చేది. ఇప్పుడు నెలకు నాలుగైదు వేలు కూడా రావట్లేదు. ఇంటి రెంటు, బండి ఈఎంఐ భారమైంది. బైక్ అమ్మేసుకోవాల్సి వచ్చింది. మేనేజ్మెంట్ మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. కన్నీళ్లను దిగమింగుకుని బతుకుతున్నం.

– సునీల్ కుమార్

(ప్రైవేట్ టీచర్, హన్మకొండ)

గాజుల షాపుల పనిచేస్తున్న

హైదరాబాద్ బడంగ్‌ పేట్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో ఐదేండ్ల నుంచి పనిచేస్తున్న. నా భర్త కూడా ఓ ప్రైవేట్ స్కూల్ టీచరే. ఆన్ న్ లో పాఠాలు చెప్తున్నందుకు ఆయనకు సగం జీతమే ఇస్తున్నరు. నా జాబ్ పోయిం ది. ఇద్దరి సంపాదన మంచిగున్న రోజుల్లో తీసుకున్న కొన్ని సామాన్లకు ఇప్పుడు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. ఇంటి రెంటు కూడా కష్టమైతున్నది. అందుకే నా బంగారాన్ని అమ్మేసినం.మరో దిక్కు లేక గాజుల దుకాణంలో పనికి కుదిరిన. చాలీచాలని జీతాలతో పూట గడవడం కష్టమైతున్నది.

– జ్యోతి, ప్రైవేట్ స్కూల్ టీచర్, బడంగ్ పేట్