
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) కొత్త సీజన్ కోసం ముస్తాబవుతోంది. 12వ ఎడిషన్ కోసం జట్లను సిద్ధం చేసుకునేందుకు ఆటగాళ్ల వేలం నిర్వహించనుంది. ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో ముంబైలో వేలం ప్రక్రియ జరుగనుంది. గతేడాది డిసెంబర్ చివర్లో ముగిసిన పీకేఎల్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ టైటిల్ నెగ్గి తొలిసారి చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ను ఓడించింది. 2014లో మొదలైన పీకేఎల్ అంచెలంచెలుగా ఎదుగుతూ కబడ్డీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
ఈ మెగా లీగ్లోని 11 సీజన్లలో 8 వేర్వేరు జట్లు ట్రోఫీ గెలిచాయి. గత ఎడిషన్తో పీకేఎల్ రెండో దశాబ్దంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు 12వ సీజన్ ఆటగాళ్ల వేలం షెడ్యూల్ను ప్రకటించడం సంతోషంగా ఉందని మషల్ బిజినెస్ హెడ్, ప్రొ కబడ్డీ లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి అన్నారు. ‘ఆయా జట్లకు రాబోయే సీజన్లో అత్యుత్తమ ఆటను కనబరచడానికి తమ వ్యూహాన్ని, నిబద్ధతను, ఆకాంక్షను చాటి చెప్పే ఒక ముఖ్యమైన వేదికగా వేలం నిలుస్తుంది. మన దేశ ఆట కోసం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఒకచోట చేర్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది’ అని అభిప్రాయపడ్డారు.