హైదరాబాద్ నగరాన్ని డల్లాస్, న్యూయార్క్లాగా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జాలు చేసిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గాంధీ సెంటనరీ హాల్ లో తెలంగాణ సమాజ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో... రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ మీటింగ్ కి తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ అలె భాస్కర్ తో పాటు... పలువురు రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యారు. బీసీ ముఖ్యమంత్రి-రాజకీయ పక్షాల అభిప్రాయాలపై నేతలు ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని ఆయన విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వనరులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. బీసీ ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ ప్రజల్లో వచ్చిందన్నారు.
బాధితులకు పరిహారం అందించాలి..
వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు త్వరగా నష్టపరిహారం అందించాలని కోదండరాం డిమాండ్చేశారు. బీర్ఎస్ నేతల కబ్జాలతో హైదరాబాద్ నగరం తరచూ ముంపునకు గురవుతోందని ఆరోపించారు. గురుకుల పరీక్షలన్నీ ఒకే ప్రాంతంలో నిర్వహించాలని డిమాండ్చేశారు. సొంత గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించాలని కోరారు.