ఆదిలాబాద్​ జిల్లాలో తొలి రోజు 6 నామినేషన్లు

ఆదిలాబాద్​ జిల్లాలో తొలి రోజు 6 నామినేషన్లు
  •     ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో  ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 
  •     ఆదిలాబాద్​లో 1,  సిర్పూర్​లో 1 
  •     నిర్మల్​లో 1, ముథోల్​లో 1
  •     బెల్లంపల్లో 1, చెన్నూరులో 1 

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా  అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ  ప్రక్రియ  ప్రారంభమైంది.  మొదటిరోజు శుక్రవారం  6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్​ జిల్లాలో  1, నిర్మల్​ జిల్లాలో 2, కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో 1, మంచిర్యాల జిల్లాలో 2 నామినేషన్లు​ పడ్డాయి.

ఆదిలాబాద్​టౌన్, వెలుగు:  ఆదిలాబాద్​ జిల్లాలో ఆదిలాబాద్​ అసెంబ్లీ స్థానానికి  బట్టి సవర్గాం గ్రామానికి చెందిన అన్నం దేవేందర్ స్వతంత్ర అభ్యర్థిగా​ నామినేషన్​ దాఖలు చేశారు. బోథ్​ స్థానానికి మొదటి రోజు నామినేషన్లు దాఖలు కాలేదు.  ఎన్నికల రిట్నర్నింగ్​ అధికారులు ఆదిలాబాద్​లో స్రవంతి, బోథ్​లో చాహాత్​ బాజ్​ పాయ్  నామినేషన్లు స్వీకరించారు.
 
నిర్మల్ లో  నామినేషన్ వేసిన మహేశ్వర్ రెడ్డి

 నిర్మల్, వెలుగు:  జిల్లాలోని  నిర్మల్  సెగ్మెంట్ లో  మొట్టమొదటి నామినేషన్ దాఖలయింది. శుక్రవారం మంచి ముహూర్తం ఉండడంతో బీజెపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఆర్డీవో రత్న కల్యాణికి అందజేశారు.

మహేశ్వర్ రెడ్డి తన ఇంటి నుంచి సతీమణి కవితారెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మహేశ్వర్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి నామినేషన్ పత్రాలు అందజేశారు. కాగా మరో సెట్ నామినేషన్ ను మహేశ్వర్ రెడ్డి కొద్దిరోజుల్లోనే  దాఖలు చేయనున్నారు.

సిర్పూర్ స్థానానికి  రావి శ్రీనివాస్ తొలి నామినేషన్  

కాగ జ్ నగర్,వెలుగు: సిర్పూర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి శ్రీనివాస్  తరపున మొదటి నామినేషన్  దాఖలు అయింది. రావి శ్రీనివాస్ తరపున ఆయన సతీమణి సునీత సిర్పూర్ టీ తహసీల్దార్ ఆఫీస్ లో రిటర్నింగ్ ఆఫీసర్  దీపక్ తివారీకి నామినేషన్ పత్రాలు అందజేశారు.  
 
బెల్లంపల్లిలో బీజీపీ అభ్యర్థి శ్రీదేవి నామినేషన్ 

బెల్లంపల్లి, వెలుగు:  మొదటి రోజు  మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లిలో ఒక నామినేషన్​ దాఖలయింది. పట్టణంలోని తహసీల్దార్ ఆఫీసులో ఎన్నికల రిటర్నింగ్  అధికారి రాహుల్ కు  బీజేపీ అభ్యర్థి అమురాజుల శ్రీదేవి నామినేషన్ పత్రం అందజేశారు.

చెన్నూరులో నామినేషన్ వేసిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి  

చెన్నూర్,వెలుగు: చెన్నూరు నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సోగాల సంజీవ్ శుక్రవారం నామినేషన్ వేశారు. శుక్రవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయలో మొదటి నామినేషన్ సెట్ ను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ  తరపున ఒకరు నామినేషన్ దాఖలు చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిడాం దత్తు తెలిపారు. 

ముథోల్​లో  నారాయణరావు పటేల్ 

ముధోల్, వెలుగు : ముధోల్ నియోజవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ కార్యాలయంలో శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి కోమల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్  అభ్యర్థి భోస్లే నారాయణరావు పటేల్ తమ మొదటి విడత రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన వెంట షిందే ఆనందరావు పటేల్,  జుట్టు అశోక్,  అఖిలేష్ పటేల్, సహీద్, శంకర్ చంద్రే, రామచంద్ర రెడ్డి, అహ్మద్ సహబ్, అంజద్ షేక్, లతీఫ్, మోహన్ పటేల్, సాయరెడ్డి, తదితరులు,పాల్గొన్నారు.