పల్లె కొచ్చిన పబ్లిక్ స్కూల్..సీఎం ఇలాకాలో రూ.12 కోట్లతో సెమీ రెసిడెన్షియల్ ప్రారంభం

పల్లె కొచ్చిన పబ్లిక్ స్కూల్..సీఎం ఇలాకాలో రూ.12 కోట్లతో సెమీ రెసిడెన్షియల్  ప్రారంభం

 

  •     పాఠశాలల విలీన ప్రక్రియకు చర్యలు
  •     మారనున్న గ్రామీణ విద్య రూపురేఖలు 

నాగర్​కర్నూల్, వెలుగు: గ్రామీణ ప్రాంతంలో విద్యను బలోపేతం చేయడంలో భాగంగా నాగర్​కర్నూల్​ జిల్లా వంగూరు మండలకేంద్రంలో సెమీ రెసిడెన్షియల్  స్కూల్​ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ విద్యా  కమిషన్  ఆధ్వర్యంలో పైలట్​ ప్రాజెక్ట్​ కింద వంగూరులో తెలంగాణ పబ్లిక్​ స్కూల్  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

నర్సరీ నుంచి ఇంటర్​ వరకు తెలంగాణ పబ్లిక్​ స్కూల్, నర్సరీ నుంచి రెండవ తరగతి వరకు తెలంగాణ ఫౌండేషన్  స్కూల్స్​ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ పంపించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రక్రియ షురూ..

ఈ విద్యా సంవత్సరంలోనే వంగూరు మండలకేంద్రంలో తెలంగాణ పబ్లిక్​ స్కూల్​ ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు పాఠశాలల విలీన ప్రక్రియను ప్రారంభించారు.  వంగూరులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జడ్పీ హైస్కూల్, జడ్పీ గర్ల్స్​ హైస్కూల్, జూనియర్  కాలేజీతో  పాటు రెండు ప్రైమరీ స్కూల్స్​ను విలీనం చేశారు. ఇదే క్యాంపస్​లో కేజీబీవీ కూడా ఉంది. ఒక బ్లాక్​లో రెండు హైస్కూల్స్, మరో బ్లాక్​లో రెండు ప్రైమరీ స్కూల్స్​ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు​చేశారు. 

అన్ని హంగులతో..

వంగూరులో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్​ స్కూల్​లో రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులు, జాతీయ స్థాయి క్రీడా మైదానాలు, హైటెక్​ ప్రమాణాలతో డిజిటల్​ క్లాస్ రూమ్స్, కంప్యూటర్​ ల్యాబ్స్, సైన్స్​ ల్యాబ్స్, ఔట్​ డోర్, ఇండోర్​ గేమ్స్​కు సౌలతులు కల్పించనున్నారు. 1,500 నుంచి 1800 మంది విద్యార్థులకు టీపీఎస్​లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఈ స్కూల్​లో చదువుకునే స్టూడెంట్లకు ఉదయం బ్రేక్​ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్​ అందిస్తారు. 

విద్యార్థుల విద్య, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్టాండర్డ్​ మెనూ రూపొందించారు. గ్రామీణ ప్రాంత పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా సెమీ రెసిడెన్షియల్​ విధానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. తెలంగాణ పబ్లిక్​ స్కూల్​కు వచ్చే విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఇందుకోసం మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. 

అడ్మిషన్లు పెరిగినయ్..

వంగూరులో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్​ స్కూల్​లో అడ్మిషన్లు పెరిగాయి. ఇప్పటికే నాలుగు స్కూల్స్​ విలీన ప్రక్రియ పూర్తయింది. అన్ని హంగులతో బిల్డింగ్​ పూర్తయితే ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయి. సెమీ రెసిడెన్షియల్​ విధానంలో విద్యాబోధన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారుతుంది.-మరిగంటి మురళీ మోహనాచారి. కన్వీనర్, టీపీఎస్