
థియేటర్ల బంద్ ఇష్యూ టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.. ఎగ్జిబిటర్లకు ప్రొడ్యూసర్లకు మధ్య మొదలైన వివాదం కాస్తా.. ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో హీట్ మరింత పెరిగింది. ఈ క్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్. రెండు రోజులుగా ఆ నలుగురు అంటూ వార్తలు రాస్తున్నారని.. ఆ నలుగురిలో తాను లేనని, ఆ నలుగురితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు అల్లు అరవింద్.
ఆ నలుగురు కాస్తా.. పది మంది అయ్యారని, చాలా ఏళ్ళ నుంచి ఇది నడుస్తోందని అన్నారు. ఆంధ్రలో 15 వందల థియేటర్లు ఉంటే.. తనకు 15 థియేటర్ల లోపే ఉన్నాయని.. నైజాం లో AAA సినిమాస్ తప్ప, ఒక్క థియేటర్ లేదని.. లీజుకు తీసుకోలేదని అన్నారు. 60 ఏళ్లుగా నా వృత్తి సినిమాలు తీయడమేనని... ఆ వృత్తినే నమ్ముకొన్నానని అన్నారు అల్లు అరవింద్. థియేటర్ల మూసివేతపై సినిమాటోగ్రఫీ మినిస్టర్ స్పందించిన విధానం సమంజసం అనిపిస్తోందని.. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ పేషీ లేఖ సమర్థనీయం అని అన్నారు.
ఛాంబర్లో జరిగిన ఏ మీటింగ్ కీ తాను వెళ్లలేదని.. థియేటర్ల మూసివేత ఏకపక్షంగా తీసుకొన్న నిర్ణయమని అన్నారు. మీటింగ్ కి తనను పిలిచినా చిరాకు వేసి మీటింగులకు వెళ్లలేదని అన్నారు. థియేటర్లు ముస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ను బెదిరిస్తున్నారని.. పవన్ సినిమా రిలీజ్ కు ముందు థియేటర్లు మూసేస్తామని అనడం దుస్సాహసమని అన్నారు అల్లు అరవింద్. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏపీ ప్రభుత్వాన్ని ఎవరూ కలవలేదని.. గత సీఎంను సినీ పెద్దలు వెళ్లి ఎందుకు కలిశారని ప్రాశ్నించారు అల్లు అరవింద్. ఇండస్ట్రీ నుంచి వెళ్లి పవన్ డిప్యూటీ సీఎం అయ్యారని.. ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పవన్ కృషి చేస్తున్నారని అన్నారు. థియేటర్ల బంద్ వివాదం ముదిరిన వేళ అల్లు అరవింద్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.