
నిర్మాతల మండలిలోని గిల్డ్ సభ్యుల మాఫియా వల్ల చిత్ర పరిశ్రమ నాశనమవుతోందని నిర్మాత సి. కళ్యాణ్ విమర్శించారు. గిల్డ్ పేరుతో 27 మంది నిర్మాతలు పరిశ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. యాడ్స్, అవార్డుల పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఘాటు విమర్శలు చేశారు. రేపు నిర్మాత మండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. నిర్మాత మండలి ఎన్నికల్లో గిల్డ్ సభ్యులు పోటీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గిల్డ్ మాఫియాలో దిల్ రాజు కూడా భాగస్వామేనని విమర్శించారు. చిన్న సినిమాలను అణగదొక్కుతూ పరిశ్రమను నాశనం చేస్తున్నారని.. చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుందన్నారు..
‘అసలు గిల్డ్ లో ఉన్నది 27 మంది సభ్యులే. నిర్మాతల మండలిలో 1200 మంది ఉన్నారు. గిల్డ్ సభ్యుల సమస్యలను నిర్మాతల మండలి పరిష్కరించింది. అందుకే ఓటర్లు ఆలోచించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. నిర్మాతల మండలిలో దామోదర ప్రసాద్ నాలుగేళ్లుగా కార్యదర్శిగా ఉన్నారు. అతను చేసిందేమి లేదు. నిర్మాతలు కొంతమంది దిల్ రాజును తప్పుదారి పట్టించారు. దిల్ రాజుతో నన్ను పోలుస్తూ దుష్ఫ్రచారం చేస్తున్నారు. గిల్డ్ మాఫియాలో దిల్ రాజు కూడా భాగస్వామే. నిర్మాతగా నేను 80 చిన్న సినిమాలు తీశా. ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు.’ అని కళ్యాణ్ విమర్శలు చేశారు.
రేపే నిర్మాతల మండలి ఎన్నికలు
రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిలింఛాంబర్ లో తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. 2023-2025 కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు సభ్యులు. అధ్యక్ష బరిలో నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ ఉన్నారు. దామోదర ప్రసాద్ కు నిర్మాత దిల్ రాజు మద్దతిస్తుండగా.. జెమిని కిరణ్ కు సి. కళ్యాణ్ మద్దతిస్తున్నారు. ప్రొగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ పేరుతో దామోదరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్ పేరుతో జెమినీ కిరణ్ పోటీ చేస్తున్నారు. తెలుగు నిర్మాతల మండలిలో సుమారు 1200 మంది సభ్యులు ఉన్నారు. దామోదర్ ప్రసాద్ కు గిల్డ్ లోని 27మంది అగ్ర నిర్మాతలు మద్దతిస్తున్నారు.