‘రాధేశ్యామ్’ రిలీజ్తో సంబంధం లేకుండా మిగతా సినిమాల్ని కంప్లీట్ చేయడంలో మునిగిపోయాడు ప్రభాస్. వరుస ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వాటిలో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సాలార్’ ఒకటి. ‘కేజీయఫ్’ సిరీస్ తర్వాత అతడు డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నాడట. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ మైస్మరైజ్ చేయడం ఖాయమంటున్నారు మేకర్స్. ఇరవై కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్ స్టాండర్డ్స్లో దీన్ని తీస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం ఆరేడు నిమిషాలు మాత్రమే ఉండే ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ అట.
ఇప్పటివరకు ప్రభాస్ చేసిన యాక్షన్ సన్నివేశాలను మించి ఇది ఉంటుందట. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. బ్యాలెన్స్ షూట్ కూడా త్వరలోనే ఫినిష్ చేసి ఈ యేడు సెకెండాఫ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తండ్రీ కొడుకులుగా ప్రభాస్ డ్యూయెల్ రోల్లో కనిపిస్తాడని టాక్. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ‘రాధేశ్యామ్’ మార్చిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఓం రౌత్ రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ పార్ట్ పూర్తయ్యింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ రెండు షెడ్యూల్స్ కంప్లీటయ్యాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయనున్న ‘స్పిరిట్’ చిత్రం త్వరలోనే సెట్స్కి వెళ్లనుంది.