వేరబుల్స్, హెడ్ఫోన్స్ తయారు చేసే పెద్ద కంపెనీలన్నీ లోకల్గా తయారీని పెంచుతున్నాయి. చైనా దిగుమతులపై ఆధారపడకుండా ఇక్కడి ప్రొడక్షన్పై ఫోకస్ పెడుతున్నాయి. మరోవైపు మొబైల్ ఫోన్ల తయారీకి అన్ని కంపెనీలూ మన దేశంలోనే ప్రొడక్షన్ ఫెసిలిటీలు పెట్టడం కూడా ఈ వేరబుల్స్ కంపెనీలకు కలిసి వస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కింద ఆమోదం పొందిన ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ తన నోయిడా ప్లాంట్లో డజన్ల కొద్దీ మోడల్స్లో హియరబుల్, వేరబుల్ ప్రొడక్ట్స్ను తయారు చేస్తోంది. గురుగ్రామ్ కంపెనీ నెక్స్బేస్కు నాయిస్ బ్రాండ్ పేరుతో ప్రొడక్టులను తయారు చేసి ఆప్టిమస్ ఇస్తోంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) డేటా ప్రకారం 2021 క్యూ3లో ఇండియాలోకి 26 శాతం వేరబుల్స్ షిప్మెంట్లు వచ్చాయి. హియరబుల్ కేటగిరీలో ట్రూలీ వైర్లెస్ హెడ్ఫోన్స్ తయారీ వస్తుంది. వ్యక్తుల చెవిలో ఇమిడిపోయే ఈ వైర్లెస్ హెడ్ఫోన్స్ బ్లూటూత్తో పనిచేస్తాయి.
ఉద్యోగాలు పెరుగుతున్నాయి..
మా పోర్ట్ఫోలియోలో ఎక్కువ భాగం ఇండియాలోని ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ఫెసిలిటీలోనే తయారు చేయించుకోవాలని నిర్ణయించామని నాయిస్ కో ఫౌండర్ అమిత్ ఖత్రి వెల్లడించారు. ట్రైలీ వైర్లెస్ హెడ్ఫోన్ల డిజైన్ కూడా ఇక్కడే రూపొందించనున్నట్లు చెప్పారు. రాబోయే ఏడాదిలో భారీ పెట్టుబడుల ప్లాన్స్ను ఈ కంపెనీ వేసుకుంటోంది. 2022లో కొత్తగా 1,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ గురురాజ్ వెల్లడించారు. నాయిస్తోపాటు, మరికొన్ని లోకల్ బ్రాండ్స్తోనూ కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాది కాలంలో వేరబుల్స్, హియరబుల్స్ ప్రొడక్షన్ కెపాసిటీని డబుల్ చేయనున్నట్లు తెలిపారు. దేశంలో తన మూడో ఫెసిలిటీని నోయిడా వద్ద ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తోంది. ఇది రాబోయే నాలుగైదు నెలల్లో ప్రొడక్షన్ మొదలు పెడుతుంది.
కరోనా టైమ్లో పెరిగిన వాడకం..
కరోనా మహమ్మారి రాకతో మన దేశంలో వేరబుల్స్, హియరబుల్స్ మార్కెట్ శరవేగంతో దూసుకెళ్తోంది. డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోంది. వేరబుల్స్ మార్కెట్ మన దేశంలో 93.8 శాతం (దాదాపు రెట్టింపు) పెరిగినట్లు ఐడీసి డేటా వెల్లడిస్తోంది. 23.8 మిలియన్ యూనిట్ల వేరబుల్స్ మన దేశానికి షిప్ అయినట్లు పేర్కొంటోంది. బోట్ వంటి దేశీ బ్రాండు గ్లోబల్గా టాప్ 5 బ్రాండ్లలోకి చేరింది. రూ. 3,500 కోట్ల ఐపీఓకి రెడీ అవుతున్న బోట్ చాలా హియరబుల్ ప్రొడక్ట్స్ను మన దేశంలోనే తయారు చేస్తోంది. బెంగళూరులో ఈ ఏడాదే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్నూ ఈ కంపెనీ పెట్టింది. కరోనా మహమ్మారితో ఇక్కడే తయారు చేసే అవకాశం దొరికింది, దీంతో మేకిన్ ఇండియా బ్రాండ్ కింద గ్లోబల్గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని బోట్ సీఈఓ వివేక్ గంభీర్ చెప్పారు. కొన్ని క్వార్టర్ల కిందట మన దేశం వేరబుల్స్, హియరబుల్స్ కోసం పూర్తిగా దిగుమతుల మీదే ఆధారపడేది. ఈ కొన్ని నెలల్లోనే పరిస్థితులలో మార్పు కనబడుతోందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వెల్లడించారు.