న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం ‘ముఖ్యమైన లాభదాయకమైన యజమాని’ నిబంధనలను (ఎస్బీఓలు) ఉల్లంఘించినందుకు మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ ఇండియాతోపాటు సత్య నాదెళ్ల మరో ఎనిమిది మందిపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం జరిమానా విధించింది. మైక్రోసాఫ్ట్ డిసెంబర్ 2016లో ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్ను కొనుగోలు చేసింది.
సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీ తదితరులు కంపెనీ ఎస్బీఓల గురించి సెక్షన్ 90(1) ప్రకారం రిపోర్ట్ చేయడంలో విఫలమైన కారణంగా ఈ చర్య తీసుకుంది. ర్యాన్ జూన్ 1, 2020న లింక్డ్ఇన్ కార్పొరేషన్ గ్లోబల్ సీఈఓగా నియమితులయ్యారు. సెక్షన్ 90 ఎస్బీఓకి సంబంధించినది. దీని ప్రకారం కంపెనీలు ఎస్బీఓ వివరాలను వెల్లడించాలి. సత్య, ర్యాన్తోపాటు మరో ఏడుగురు వ్యక్తులపై ఆర్ఓసీ మొత్తం రూ. 27,10,800 జరిమానా విధించింది. లింక్డ్ఇన్కు రూ. 7 లక్షలు, నాదెళ్ల, ర్యాన్కు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు.