హైదరాబాద్, వెలుగు: గోల్ఫ్ అంటే కేవలం సంపన్న వర్గాలకే పరిమితం అనే ముద్ర ఉందని, కానీ ఆసక్తి ఉంటే ఎవరైనా ఈ ఆటలో రాణించవచ్చని లెజెండరీ క్రికెటర్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) ప్రెసిడెంట్ కపిల్ దేవ్ చెప్పాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన కపిల్ ఇది అందరి ఆట అన్నాడు.
క్రికెట్ మాదిరిగా జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం గోల్ఫ్లో ఉండదన్నాడు. పీజీటీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బోల్డర్ హిల్స్ గోల్ఫ్, కంట్రీ క్లబ్ వేదికగా ఈ నెల 14 నుంచి 17 వరకు జరిగే బోల్డర్స్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నీ ట్రోఫీని కపిల్ ఆదివారం ఆవిష్కరించాడు. రూ. 1 కోటి ప్రైజ్మనీ లభించే టోర్నీలో 132 మంది ప్రొఫెషనల్ గోల్ఫర్లు పాల్గొంటారు.
