వరిలో నాలుగు కొత్త వంగడాలు

వరిలో నాలుగు కొత్త వంగడాలు
  •     సెంట్రల్ వెరైటల్, స్టేట్​వెరైటల్ రిలీజ్ కమిటీల ఆమోదం
  •     వెల్లడించిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

గండిపేట, వెలుగు : సెంట్రల్ వెరైటల్​, రాష్ట్ర స్థాయి వెరైటల్ రిలీజ్ కమిటీల ఆమోదంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మంగళవారం వివిధ పంటల్లోని కొత్త వంగడాలను విడుదల చేసింది. వరి, మొక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న పంటలు కలిపి మొత్తం ఎనిమిది రకాలకు ఆమోదం తెలిపినట్లు వర్సిటీ వీసీ ​ఎం.రఘునందన్​రావు, రీసెర్చ్​ డెరెక్టర్ ​డాక్టర్ పి.రఘురామిరెడ్డి వెల్లడించారు.

వరిలో రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదంతో రెండు రకాలు, సెంట్రల్​కమిటీ ఆమోదంతో మరో రెండు రకాలను విడుదల చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదంతో జొన్న, రాగి సజ్జ పంటల్లో ఒక్కొక్కటి చొప్పున, సెంట్రల్ కమిటీ ఆమోదంతో మొక్కజొన్నలో మరో రకాన్ని విడుదల చేశారు.

ఏడాదిలో రెండు పంటలు

గడిచిన పదేండ్లలో రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పెరిగింది. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఏడాదికి రెండు పంటలు వేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో అగ్గి తెగులు, సుడిదోమ, ఉల్లికోడులను తట్టుకొనే నాలుగు వరి రకాలను తీసుకొచ్చేందుకు సైంటిస్టులు కృషి చేశారు. రాజేంద్రనగర్ వరి పేరిట ‘ఆర్‌ఎన్‌ఆర్‌ 28361’ అనే దొడ్డు గింజల రకానికి రాష్ట్రస్థాయి వెరైటల్ కమిటీ ఆమోదం తెలిపిందని ఎం.రఘునందన్ రావు, డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు.

అలాగే తక్కువ కాలంలో సన్నని, పొడవైన గింజ, తక్కువ నూక శాతం (దిగుబడి 62.3 కిలోలు) ఉండే తెలంగాణ వరి(కేఎన్‌ఎం- 7037) రకాన్ని అందుబాటులోకి తెచ్చామని, ఈ రకాన్ని  జాతీయస్థాయిలో విడుదల చేశామని తెలిపారు. సుడిదోమ, అగ్గి తెగులు, ఎండుకోళ్లు తెగులును తట్టుకొనే తెలంగాణ వరి-1289 (WGL-1289)ను కూడా జాతీయస్థాయిలో విడుదల చేశామన్నారు.

ఈ రకాన్ని తెలంగాణతోపాటు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సాగు చేయొచ్చని డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు. అలాగే ఉల్లికోడు బయోటైప్ లను తట్టుకొనే వరంగల్ వరి-119ను రాష్ట్ర స్థాయిలో విడుదల చేశామని వెల్లడించారు. 

మొక్కజొన్నలో కొత్త రకం

కాండం కుళ్లు తెగులు తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే డీహెచ్‌ఎం-206 అనే నూతన మొక్కజొన్న హైబ్రిడ్ ను జాతీయస్థాయిలో విడుదల చేశామని వర్సిటీ సైంటిస్టులు తెలిపారు. ఇది ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సాగుకు అనుకూలమైన మొక్కజొన్న హైబ్రిడ్ అని వెల్లడించారు. 

మొత్తం  61 రకాలు

యాసంగిలో రైతులు ఎక్కువగా సాగుచేసే మాల్దండి జొన్న రకానికి దీటుగా, తాండూరు పరిశోధన స్థానం నుంచి SVT -55 అనే కొత్త రకం జొన్నను విడుదల చేశారు. వీటితో చేసే జొన్న రొట్టె క్వాలిటీగా ఉంటుందని తెలిపారు. అలాగే సజ్జ, రాగి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా అధిక ఐరన్, జింక్ కలిగిన పీహెచ్‌బీ 1625 సజ్జ హైబ్రిడ్ ను, అలాగే అధిక కాల్షియం కలిగిన పీఆర్‌ఎస్‌-38 రాగి రకాన్ని రాష్ట్ర స్థాయిలో విడుదల చేశారు.

గడిచిన 8 ఏండ్లలో వివిధ పంటలలో 61 నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తెచ్చామని, ఇందులో వరిలో- 25, మొక్కజొన్నలో- 2,  జొన్న-లో 5, అపరాలు-లో 11, నూనె గింజల్లో 7, పత్తిలో ఒకటి, పశుగ్రాసం 10 రకాలు ఉన్నాయని తెలిపారు.