హైదరాబాద్, వెలుగు: వెంటనే పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ(పీఆర్టీయూటీ) డిమాండ్ చేసింది. బదిలీలపై కోర్టు కేసు ఉన్నందున పదోన్నతుల ప్రక్రియను వారంలోపు ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లో పీఆర్టీయూటీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎం. చెన్నయ్య అధ్యక్షతన నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో.. పీఆర్సీ, పదోన్నతులు సహా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. 23 ఏండ్లుగా ప్రమోషన్లకు నోచుకోని పండిట్లు, పీఈటీలను అప్గ్రేడ్ చేయాలని నేతలు తీర్మానించారు. సీపీఎస్ అమలు కాకముందే 2003 డీఎస్సీ టీచర్ల రిక్రూట్మెంట్ జరిగిందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కొత్త ఈహెచ్ఎస్ పాలసీని వెంటనే ప్రకటించాలని, ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.