జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమొనీలో వెతికిన ఆ వ్యక్తి రూ.4.80 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన పుణెలోని ఫరాస్ఖానా పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకి చెందిన ఓ 55 ఏళ్ల వ్యక్తి తన భార్య నుంచి కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. మానసిక వ్యాధితో బాధపడుతున్న తన కొడుకు ఆలనాపాలన చూసుకొనేందుకు ఒక తోడు కావాలనుకున్నాడు. అందుకోసం జీవన్ సాథీ.కామ్ అనే మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ను ఆశ్రయించాడు. అందులో తన ప్రొఫైల్ కు తగినట్లుగా ఓ మహిళ నుంచి రిక్వెస్ట్ రావడంతో.. ఆమెతో పరిచయం పెంచుకొని ఫోన్ లో బాగా దగ్గరయ్యాడు.
ఆ మహిళ తానొక పార్శిల్ ను పంపిస్తున్నాననీ.. అందుకోసం కొంత నగదును చెల్లించాల్సిందిగా అతన్ని కోరింది. దాంతో ఆ వ్యక్తి విడతల వారీగా 8 నెలల కాలంలో దాదాపు రూ.4.80 లక్షలను ఆమెకు బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించాడు. కొంత కాలానికి.. ఆమె నుంచి ఎలాంటి కాల్స్ కానీ, మెసేజెస్ కానీ రాకపోవడంతో బాధితుడు .. తాను మోసపోయానని గుర్తించి.. పోలీసులను ఆశ్రయించాడు.
అతని ఫిర్యాదుతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, సిస్టమ్ ఐపీ అడ్రస్ వివరాలతో.. ఆమెను పట్టుకుంటామని ఫరాస్ఖానా ఏఎస్పీ వి.ఎ.తవాడే తెలిపారు.
