పెళ్లి కావట్లేదని మానసికంగా కృంగిపోయిన ఓ వ్యక్తి తన మరణానికి పర్మిషన్ కావాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. పుణెలో నివాసం ఉంటున్న ఓ 35 ఏళ్ల యువకుడు కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ 20 రోజుల క్రితం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కార్యాలయానికి లేఖ రాశారు.
ఆ లేఖలో వృద్ధులైన తన తల్లిదండ్రులకు కొడుకుగా ఏమీ చేయలేకపోతున్నానని, కేరీర్లో సరిగా స్థిరపడలేకపోయానని, 35 ఏళ్లు పూర్తవుతున్నా పెళ్లి అవ్వడం లేదని తెలిపాడు. అంతేకాకుండా ఇరుపొరుగు వాళ్లంటున్న సూటిపోటు మాటలు తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని, దయచేసి తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. సీఎంవో ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవిదాస్ తెలిపారు.