మేము ఒక గంట కళ్లు మూసుకుంటే.. చంద్రబాబుకు పోలీసులు వార్నింగ్

మేము ఒక గంట కళ్లు మూసుకుంటే..  చంద్రబాబుకు పోలీసులు వార్నింగ్

చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనపై ఏపీ పోలీస్ సంఘ నేతలు స్పందించారు.  ఏ ప్రభుత్వం వచ్చినా.. నిందలు తమపైనే ఉంటాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రాణాలకు తెగించి ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయబద్దంగా తాము విధులు నిర్వహిస్తుంటే తమపైనా దాడులు చేస్తూ రాజకీయ పార్టీలు రచ్చ చేస్తున్నాయని పోలీసులు తెలిపారు.  మీ స్వార్థ రాజకీయాల కోసం తమను బలిపశువులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  14 ఏళ్లు సీఎం చేసిన చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇలా దాడికి దిగడం ఎంతవరకు సమంజసమని పోలీసుల సంఘం ప్రశ్నించింది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడతారని నిలదీశారు.  మేము ఒక్క గంట పక్కకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? మీరు గుండెలపై చేయి వేసుకుని పడుకుంటున్నారంటే అది మా వల్లే.. పండుగలు వస్తే మీరు కుటుంబాలతో ఎంజాయ్ చేస్తారు.. మేము బందోబస్తు డ్యూటీ లో ఉంటాం అని తెలిపారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనలో బాధితులంతా పోలీసులేనని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. మరో 50 మంది పోలీసులకు  గాయాలయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు సంయమనం పాటించారని తెలిపారు. ఈ దాడి వెనుక సీరియస్ కుట్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు. మారణాయుధాలతో వారు ఉద్దేశపూర్వకంగా తమపై దాడికి యత్నించారని చెప్పారు. ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోందని.. ఎవరిని వదిలిపెట్టేది లేదన స్పష్టం చేశారు. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు.. చంద్రబాబు రూట్ మ్యాప్ ను మార్చాలని చూశారని ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారిని బట్టలిప్పాలనడం దుర్మార్గం అని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థలో తాము పనిచేశామని గుర్తు చేశారు. తాము ఏ పార్టీకి అనుకూలంగా ఎన్నడూ పనిచేయలేదన్నారు. ఒకవేళ తాము సహనం కోల్పోతే పరిస్థితి ఏంటన్నారు. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. కార్యకర్తలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని సూచించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఫైర్ అయింది. పుంగనూరు ఘటనను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.  మీ రాజకీయాల కోసం మాపై దాడులు చేయడమేంటి అని ఏపీ పోలీసు అధికారుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు ప్రశ్నించారు. పోలీసులను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులను హతమార్చేందుకు కాకుంటే తుపాకులు, రాడ్లు, కర్రలతో టీడీపీ నాయకులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.  పుంగనూరులో పోలీసులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ, ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.

పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు నాగిని మాట్లాడుతూ ఎవరిపై ఎవరు దాడి చేశారని ప్రశ్నించారు. పోలీసులపై జరిగింది కాబట్టి సరిపోయింది.. ప్రజలపై జరిగితే తమనే విమర్శిస్తారని పేర్కొన్నారు. కష్ట కాలంలో తాము ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఉద్యోగాలు చేస్తున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వం ఉన్నా తమ డ్యూటీ తాము చేస్తున్నామని వెల్లడించారు.పోలీసు వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించాలని చూశారని తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.