న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ క్వారంటైన్లోకి వెళ్లారు. శుక్రవారం ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టన్ అమరీందర్ సింగ్, స్సీకర్ తో పాటు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలకు వైద్యశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించగా నిర్మల్ సింగ్, కుల్బీర్ సింగ్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ప్రొటోకాల్, వైద్యుల సలహా ప్రకారం ఏడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని అమరీందర్ సింగ్ నిర్ణయించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఇద్దరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన శాసనసభ్యుల సంఖ్య 32కి చేరుకున్నది.
కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యేలతో సన్నిహితంగా మెలిగిన సాటి ఎమ్మెల్యేలు అందరూ వైద్యపరీక్షలు చేయించుకోవాలని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అధికారులను ఆదేశించారు. పంజాబ్ భవన్, ఎమ్మెల్యేల క్వార్టర్స్ దగ్గర త్వరితగతిన కరోనా వైద్యపరీక్షలు నిర్వహించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.