కెనడాలో కొడుకు హత్య.. అది తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

కెనడాలో కొడుకు హత్య.. అది  తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

చండీగఢ్: పంజాబ్​లో హృదయవిదారక ఘటన జరిగింది. కెనడాలో చదువుకుంటున్న కొడుకు హత్యకు గురికాగా, అతడి మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లీకొడుకు మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించింది. భగత్ సింగ్ నగర్ జిల్లాలోని కరీంపూర్ చాహ్వాలా గ్రామానికి చెందిన గుర్విందర్ నాథ్(24) చదువుకునేందుకు కెనడాకు వెళ్లాడు. అక్కడ పిజ్జా డెలివరీ బాయ్​గా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 9న రాత్రి పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్తుండగా, కొంతమంది దుండగులు అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గుర్విందర్​ను ఆస్పత్రిలో చేర్పించగా, ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 

గుర్విందర్ చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు.. పంజాబ్ లోని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే ఈ విషయాన్ని గుర్విందర్ తల్లి నరీందర్ కౌర్ కు కుటుంబసభ్యులు చెప్పలేదు. గుర్విందర్ డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. శుక్రవారం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు డెడ్ బాడీ వస్తుందని తెలిసి, అప్పుడు కొడుకు చనిపోయిన విషయాన్ని తల్లికి చెప్పారు. ఆ వార్త విని నరీందర్ కౌర్ తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురై, విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. అటు కొడుకు డెడ్ బాడీ ఇంటికి చేరకముందే, ఇటు తల్లి చనిపోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం రాత్రి గుర్విందర్ డెడ్ బాడీ ఇంటికి చేరుకోగా.. శనివారం ఉదయం తల్లి, కొడుకు ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు.