ఆమనగల్లు, వెలుగు: అనవసర విమర్శలు మాని ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ నేతలకు సూచించారు. బండి, గుండోడు, గుడ్లోడు ఎగిరెగిరి పడ్తూ స్టేట్ గవర్నమెంట్మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏడేళ్ళుగా ఓపికగా ఉన్నామని, ఇక వారిపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. సోమవారం ఆమనగల్లులో రైతు వేదిక , వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. లైబ్రరీ బిల్డింగ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయానికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన మీటింగ్లో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ పెంచిన పెట్రోల్, డీజిల్రేట్లపై పోరాడాలని సూచించారు. కేసీఆర్ చొరవతో తీసుకున్న చర్యల వల్ల దేశంలోనే వరి దిగుబడుల్లో రాష్ర్టం అగ్రస్థానంలో ఉందన్నారు. పంజాబ్లో పండిన వడ్లను పూర్తిగా కొంటున్న కేంద్రం తెలంగాణ నుంచి కొనకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వంద జాకీలు పెట్టినా లేవలేనిస్థితిలోఉన్న కాంగ్రెస్ను ప్రజలు నమ్మబోరన్నారు. ఎన్ని అవాంతాలు సృష్టించినా పాలమూరు,రంగారెడ్డి లిఫ్ట్ను సీఎం కేసీఆర్పూర్తి చేసి తీరుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఆశీర్వదించాలని కోరారు. నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.
మంత్రులకు నిరసన సెగ
ప్రజలు కోరుకుంటున్న చోట కాకుండా ఆమనగల్లులో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, నిరంజన్ రెడ్డిలకు నిరసన సెగ తాకింది. మంత్రుల కాన్వాయిని ప్రధాన కూడలి వద్ద అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా, వారిని రోడ్డు మీదికి రాకుండా పోలీసులు నిలువరించారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.