
వాషింగ్టన్: ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పిచ్చి పట్టిందని, అమాయకులను అకారణంగా చంపుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఆదివారం న్యూజెర్సీలోని మోరిస్ టౌన్ ఎయిర్ పోర్టులో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. మొత్తం ఉక్రెయిన్ను పుతిన్ స్వాధీనం చేసుకోవాలనుకుంటే, అది రష్యా పతనానికి నాంది పలకడమేనని ఆయన హెచ్చరించారు.
‘‘పుతిన్ తీరు నాకు ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పటికే చాలా మంది అమాయకులను ఆయన చంపాడు. పుతిన్తో నాకు చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. ఆయనతో కలిసి పనిచేశా. కానీ, ఆయనకు ఏమైందో! పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అలాగే, ఇరు దేశాల ఖైదీల అప్పగింత కూడా జరుగుతున్నది. ఈ టైంలో దాడులు చేయడం ఏంది? అది కరెక్టు కాదు. ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, రాకెట్లతో ఆయన విరుచుకుపడుతున్నారు. అమాయక ప్రజలను అకారణంగా చంపుతున్నారు. పుతిన్కు కచ్చితంగా పిచ్చి పట్టింది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా.. శనివారం అర్ధరాత్రి సమయంలో ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేసింది. 367 డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ పై రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదే.
అమెరికా.. మాట్లాడవేం?: జెలెన్ స్కీ
తమ దేశంపై రష్యా భీకరంగా దాడులు చేస్తున్నా అమెరికా సైలెంట్గా ఉండడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, మిగతా యూరోపియన్ దేశాలు కూడా రష్యా దాడులపై మాట్లాడడంలేదని ఆయన మండిపడ్డారు. ప్రపంచం వెకేషన్కు వెళ్లినా.. యుద్ధం కొనసాగుతుందన్నారు. ‘‘అమెరికాతో పాటు మిగతా ప్రపంచ దేశాల నిశబ్దం మంచిది కాదు. ఆ దేశాలు సైలెంట్గా ఉంటే, పుతిన్కు మద్దతు ఇచ్చినట్లే. శనివారం అర్ధరాత్రి రష్యా చేసిన దాడితో ఉక్రెయిన్లోని ప్రతి మూలపైనా ప్రభావం పడింది” అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.