
టోక్యో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి తీవ్రంగా నిరాశపర్చింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఓటమి పాలై ఇంటి బాటపట్టింది. బుధవారం (జూలై 16) జరిగిన ఉమెన్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచులో 15-21, 14-21 తేడాతో సింధును చిత్తు చేసింది కొరియాకు చెందిన సిమ్ యు జిన్. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు ప్రత్యర్థి సిమ్ యు జిన్ ముందు తేలిపోయింది.
గత కొంత కాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతోన్న భారత షట్లర్.. ఈ మ్యాచులోనూ సరైన లయ అందుకోలేకపోయింది. రెండు రౌండ్లలో స్పష్టమైన అధిక్యం కనబర్చిన సిమ్ యు జిన్ అద్భుత విజయంతో టోర్నీలో అడుగు ముందుకేసింది. తొలి గేములో ముందుగా 3-9తో వెనుకబడిన సింధు ఆ తర్వాత 12-13తో పోటీలోకి వచ్చింది. కానీ చివరి వరకు అదే పోరాటాన్ని కొనసాగించడంలో విఫలమై ఫస్ట్ సెట్ కోల్పోయింది.
ఇక, రెండో గేములో 7-7, 11-11తో ప్రత్యర్థికి పోటీనిచ్చినా సింధు.. అనవసర తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. వరుసగా రెండు సెట్లు కోల్పోయి తొలి దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో తొలి రౌండ్లోనే సింధు ఓటమి పాలు కావడం ఇది నాలుగోసారి. 2025 జనవరిలో జరిగిన ఇండియన్ ఓపెన్లో క్వార్టర్స్కు చేరుకోవడమే ఈ ఏడాది సింధు అత్యుత్తమ ప్రదర్శన.
ఇక, ఇదే జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్, పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. తొలి రౌండ్లో విజయం సాధించి రెండో రౌండ్కు దూసుకెళ్లారు. లక్ష్య సేన్ చైనాకు చెందిన వాంగ్ జెంగ్ జింగ్ను 21-11, 21-18 తేడాతో ఓడించి టోర్నీలో ముందడుగేశాడు. తొలి సెట్ సునాయంగా నెగ్గిన లక్ష్య సేన్కు రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్తా ప్రతిఘటన ఎదురైంది.
ALSO READ : IND vs ENG 2025: లార్డ్స్ టెస్టులో కోహ్లీ ఉంటే టీమిండియా గెలిచేది: స్టార్ క్రికెటర్ భార్య
కానీ బలమైన షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి రెండో సెట్ను కూడా గెలిచాడు. 16వ రౌండ్లో జపాన్కు చెందిన ఏడవ సీడ్ కోడై నరోకాను లక్ష్య సేన్ ఎదుర్కొననున్నాడు. ఇక, పురుషుల స్టార్ జోడీ సాత్విక్, చిరాగ్ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్, కిమ్ డాంగ్ జులను 21-18, 21-10 తేడాతో ఓడించారు. కేవలం 42 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించి నెక్ట్స్ రౌండ్కు దూసుకెళ్లారు.