
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. పేలవ ఫామ్ను కొనసాగించిన సింధు తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టింది. మెన్స్లో కిడాంబి శ్రీకాంత్, డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్, పుల్లెల గాయత్రి–ట్రీసా జోడీలు శుభారంభం చేశాయి. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో వరల్డ్ 9వ ర్యాంకర్ సింధు 17–21, 11–21తో చైనాకు చెందిన జాంగ్ యి మన్ చేతిలో వరుస గేమ్స్లో చిత్తయింది. ఈ ఏడాది సింధు తొలి రౌండ్లోనే ఓడిన మూడో టోర్నీ ఇది. తొలి గేమ్ ఆరంభంలో సింధు 6–5తో ఆధిక్యంలోకి వచ్చింది. తర్వాత 16–13తో నిలిచి గేమ్ నెగ్గేలా కనిపించింది. కానీ, ఈ టైమ్లో వరుసగా 7 పాయింట్లు నెగ్గి 20–16తో ఆధ్యికంలోకి వచ్చిన చైనా షట్లర్ యి మన్ తొలి గేమ్ ఖాతాలో వేసుకుంది.
రెండో గేమ్లో ఇద్దరు షట్లర్లు తొలుత 5–5 సమంగా నిలిచారు. కానీ, సింధు అనవసర తప్పిదాలు చేసి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి డీలా పడింది. 7–11తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేసినా.. చైనా షట్లర్ ఆమెకు ఆ చాన్స్ ఇవ్వకుండా గేమ్తో పాటు మ్యాచ్ ముగించింది. విమెన్స్ డబుల్స్లో గాయత్రి–ట్రీసా జాలీ జంట 21–18, 21–14తో జాంకోల్ఫన్–రవింద (థాయ్లాండ్)పై నెగ్గి రెండో రౌండ్ చేరింది. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో మాజీ వరల్డ్ నం.1 శ్రీకాంత్ 19–21, 21–14, 21–5తో టొమా పొపోవ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. డబుల్స్లో ఆరో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 21–13, 21–13తో ఇండియాకే చెందిన కృష్ణప్రసాద్–విష్ణువర్దన్ ద్వయాన్ని ఓడించింది.