
- నిమజ్జనం జరిగే వరకు సీసీ కెమెరాలు, గూగుల్ మ్యాప్తో మానిటరింగ్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లోని గణేష్ మండపాలకు పోలీసులు జియో ట్యాగింగ్ చేశారు. మండపం ఏర్పాటుకు పర్మిషన్ దగ్గర్నుంచి నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకు ఆన్లైన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్స్టేషన్స్ పరిధిలోని గణపతి మండపాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రతి వినాయక మండపానికి క్యూ ఆర్ కోడ్ కేటాయించారు. దీన్ని జియో ట్యాగింగ్ ద్వారా ‘టీఎస్ కాప్’ పోలీస్ యాప్నకు కనెక్ట్ చేశారు. దీంతో ప్రతి మండపం వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లు, నిర్వాహకులతో కాంటాక్ట్స్ నిరంతరం కొనసాగుతున్నాయి. 3 నుంచి 9 రోజుల పూజలు పూర్తయ్యే గణనాథులను నిమజ్జనానికి తరలించే విధంగా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎలాంటి సమస్య వచ్చినా..
గ్రేటర్లోని3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా నిమిషాల వ్యవధిలో ఘటనా స్ధలానికి వెళ్లేందుకు పక్కా ప్లానింగ్ రూపొందించారు. హైదరాబాద్,రాచకొండ,సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం వరకు సుమారు 15 వేల గణపతి మండపాలకు పోలీసులు జియో ట్యాగింగ్ చేశారు. వీటిని గూగుల్ మ్యాప్తో కనెక్ట్ చేశారు. మండపం లొకేషన్ నిర్వాహకుల పేర్లు,ఫోన్ నంబర్లు, స్థానిక లైజన్ ఆఫీసర్ పేర్లకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మండపాల వద్ద ఎలాంటి సెక్యూరిటీ సమస్య తలెత్తినా క్షణాల్లో చేరుకునేందుకు అవకాశం ఉంటుంది.
టీఎస్ కాప్ యాప్లో డేటా
మండపాలకు సంబంధిత పీఎస్లో ఉన్న బ్లూ కోల్ట్స్, ప్యాట్రో కార్ డేటాను పోలీస్ యాప్స్తో కనెక్ట్ చేశారు. దీంతో స్థానిక డీసీపీలు,ఏసీపీలతో పాటు ఒక్కో మండపాన్ని స్థానిక లైజన్ ఆఫీసర్,సెక్టార్ ఎస్ఐ స్థాయి అధికారులు నిరంతరం కో ఆర్డినేట్ చేసుకుంటారు. ఇందులో నిర్వాహకులు పాటించాల్సిన నియమాలు, మండపం ఏర్పాటు, నిమజ్జన సమయం, రూట్ తో పాటు భద్రతా చర్యలపై పర్యవేక్షణ ఉంటుంది. ప్రతీ మండపాన్ని పోలీసులు స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. దీంతో మండపం అడ్రెస్,నిర్వాహకుల ఫోన్ నంబర్లు, నిమజ్జనం రూట్, డేట్ ను పోలీస్ ఈ–- ట్యాబ్స్కు కనెక్ట్ చేశారు. ఈ విధానంతో వీఐపీల దర్శనాలు,అనుమానాస్పద వ్యక్తులు, ప్రాంతాల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకోనున్నారు. నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో 3, 5, 7, 9, 11 రోజుల్లో నిమజ్జనానికి వెళ్లే మండపాల వివరాలను పోలీస్ యాప్స్లో పొందుపరిచారు. నిర్వాహకులతో సంబంధిత లైజన్ ఆఫీసర్ కో ఆర్డినేట్ చేసుకుంటూ నిర్ధారించిన సమయంలో గణనాథుల నిమజ్జనానికి చర్యలు తీసుకోవచ్చు. పోలీసులు రిజిస్ట్రేషన్ చేసిన మండపాలే కాకుండా గ్రేటర్ లో మరో 9 వేలకు పైగా గణనాథులను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. నిమజ్జనం జరిగే నాటికి తమ వద్ద రిజిస్టరైన వినాయక మండపాలను పూర్తిగా జియో ట్యాగ్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. జియో ట్యాగింగ్ వల్ల పోలీస్ రికార్డుల్లో రిజిస్టర్ అయిన ప్రతీ మండపాన్ని గూగుల్ మ్యాప్లో చూసే అవకాశం ఉంది. ఇలా 3 కమిషనరేట్ల పరిధిలోని గణనాథుల ఏర్పాట్లు, నిమజ్జన సమయం, నిర్వాహకుల వివరాలను ఆన్ లైన్ లో పొందుపరిచారు.