
- ఉరుస్తున్న కలెక్టరేట్
- కురుస్తున్న కార్పొరేషన్ ఆఫీస్
- జనగామ, ఖమ్మంలలో ఇదీ సర్కారు ఆఫీసుల పరిస్థితి
- రెండూ కొత్త బిల్డింగులే
జనగామ/ ఖమ్మం : రూ.67 కోట్లు ఖర్చు పెట్టి ఆరు నెలల క్రితం సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన జనగామ కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ భవనం పనులు పూర్తి చేయడానికి నాలుగేండ్లకు పైగానే పట్టింది. ఫిబ్రవరి 11న ప్రారంభోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా జనగామ కలెక్టరేట్ బిల్డింగ్ను నిర్మించారని కితాబు ఇచ్చారు. అయితే మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు బిల్డింగ్ అసలు రంగు బయటపడింది. మొదటి అంతస్తులోని జిల్లా పంచాయతీ ఆఫీస్లో గోడలకు చెమ్మ రావడంతో పాటు కరెంట్లైట్ల కోసం అమర్చిన రౌండ్షీట్( సీలింగ్రోస్)లో నుంచి చుక్కలు చుక్కలుగా నీటి బొట్లు కారుతున్నాయి . దీంతో ఉద్యోగులు ప్లాస్టిక్ టబ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రెండో అంతస్తులోని జిల్లా లేబర్ ఆఫీస్, ఖజానా ఆఫీస్, జిల్లా ఇంటర్ విద్యాశాఖ ఆఫీస్, డీఎం ఆఫీస్, గ్రీవెన్స్ నిర్వహించే హాల్ ముందు భాగం వద్ద గోడలకు చెమ్మ వస్తోంది. కలెక్టరేట్ బిల్డింగ్పైన ఫ్లోరింగ్సరిగా చేయకపోవడం, నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది.
ఖమ్మంలో నీళ్లు పడకుండా చెత్తడబ్బాలు..
ఖమ్మం: ఖమ్మంలోని గట్టయ్య సెంటర్లో కార్పొరేషన్ కొత్త ఆఫీసు భవనాన్ని కొన్ని నెలల కింద ప్రారంభించారు. ప్రస్తుత వర్షాలకు కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ బిల్డింగ్ లో నాణ్యతలోపం బయటపడింది. పలు ఫ్లోర్లలో నీళ్లు కారుతుండడంతో సిబ్బంది రంగులు వేయగా మిగిలిన డబ్బాలు, చెత్త డబ్బాలు పెడుతున్నారు. వర్షపు నీరు కారుతుండడంతో పాటు గోడలకు చెమ్మ వస్తోంది. లైట్వెయిట్ఇటుకతో అత్యంత వేగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు వాటర్ క్యూరింగ్ కూడా సరిగ్గా చేయలేదు. దీనివల్లే ఈ సమస్య తలెత్తిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఖమ్మం ప్రజలకు సేవలందించడం కోసం ముందుచూపుతో కట్టిన ఈ బిల్డింగ్ ఇప్పుడే కురుస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కాంట్రాక్టర్ నాసిరకం పనులు, అధికారుల పర్యవేక్షణ లోపం కనబడుతోందంటున్నారు.