చత్తీస్ గఢ్ నీళ్లు వాడుకుంటే పరిస్థితేంటి?..జీసీ లింక్ భవిష్యత్ ఏంటని టాస్క్ఫోర్స్ కమిటీ ప్రశ్న

చత్తీస్ గఢ్ నీళ్లు వాడుకుంటే పరిస్థితేంటి?..జీసీ లింక్ భవిష్యత్ ఏంటని టాస్క్ఫోర్స్ కమిటీ ప్రశ్న
  • జీసీ లింక్​ ప్రాజెక్ట్​లో ఎప్పుడూ రాని ప్రశ్నను ఇప్పుడు లేవనెత్తిన టాస్క్​ఫోర్స్​ కమిటీ
  • నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ, ఎన్​డబ్ల్యూడీఏ లెక్కల్లో తేడాలు
  • జీసీ లింక్​ భవిష్యత్​ ఏంటని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: గోదావరి కావేరి లింక్​ ప్రాజెక్ట్​లో ఎప్పుడూ రాని ప్రశ్న ఇప్పుడు వచ్చింది. చత్తీస్​గఢ్​ వినియోగించుకోగా మిగిలి వాడుకోని 148 టీఎంసీలను తమిళనాడుకు తరలించాలని కేంద్రం జీసీ లింక్ ప్రాజెక్ట్​ను తలపెట్టింది. ఎప్పుడూ వాటాలకు సంబంధించిన అంశాలే తెరపైకి వచ్చాయే తప్ప.. ‘చత్తీస్​గఢ్​ వాడుకుంటే..’ అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నం కాలేదు. తాజాగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన రివర్​ లింకింగ్​ టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​లో నిపుణులు అదే ప్రశ్నను లేవనెత్తారు.

నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతిపై చర్చ సందర్భంగా జీసీ లింక్​పైనా చర్చించారు. ఈ సందర్భంగా చత్తీస్​గఢ్​ ఒకవేళ తన వాటా జలాలను వినియోగించుకుంటే గోదావరి కావేరి లింక్​ ప్రాజెక్ట్​ భవిష్యత్​ ఏంటని ఎన్​డబ్ల్యూడీఏ అధికారులను కమిటీ నిపుణులు ప్రశ్నించారు. ఇటు సెంట్రల్​ వాటర్​ కమిషన్, ఎన్​డబ్ల్యూడీఏలు నీటి లభ్యతపై విరుద్ధమైన లెక్కలు చెబుతున్నాయని టాస్క్​ఫోర్స్​ కమిటీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 24న హైదరాబాద్​ జలసౌధలో రాష్ట్రాలతో నిర్వహించనున్న కన్సల్టెన్సీ మీటింగ్​లో అన్ని విషయాలను చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. 

జీసీని పక్కకు పడేసే యోచనేనా..

వాస్తవానికి ఇన్నాళ్లూ చర్చకు రాని పాయింట్​ ఇప్పుడే ఎందుకు తెరమీదకు తీసుకొచ్చారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీసీ లింక్​లో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు, కర్నాటకకు 17 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించి మిగతా నీళ్లను తమిళనాడు డ్రింకింగ్​ వాటర్​ పర్పస్​ కోసం వాడుకోవాలని కేంద్రం భావించింది. అయితే, నీటి వాటాలపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. సగం వాటా ఇవ్వాలని పట్టుబడుతున్నది.

దాంతో పాటు మిగతా సభ్య రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, చత్తీస్​గఢ్​లూ పేచీ పెడుతున్నాయి. ఇవన్నీ ఎలాగున్నా.. ఏపీ కోసమే ఇప్పుడు ఈ కొత్త ప్రశ్నను తీసుకొచ్చారా? అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. ఈ ప్రశ్న మాటున జీసీ లింక్​ను పక్కనపెట్టేస్తే.. జీబీ (గోదావరి బనకచర్ల) లింక్​కు మార్గం సుగమమవుతుందన్న ఉద్దేశంతోనే కొత్త వాదనలను తెరపైకి తెస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి, ఈ నెల 24న నిర్వహించనున్న కన్సల్టెన్సీ మీటింగ్​లో జీసీ లింక్​పై ఏం తేలుస్తారో వేచి చూడాలి.