
- జీసీ లింక్ ప్రాజెక్ట్లో ఎప్పుడూ రాని ప్రశ్నను ఇప్పుడు లేవనెత్తిన టాస్క్ఫోర్స్ కమిటీ
- నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏ లెక్కల్లో తేడాలు
- జీసీ లింక్ భవిష్యత్ ఏంటని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: గోదావరి కావేరి లింక్ ప్రాజెక్ట్లో ఎప్పుడూ రాని ప్రశ్న ఇప్పుడు వచ్చింది. చత్తీస్గఢ్ వినియోగించుకోగా మిగిలి వాడుకోని 148 టీఎంసీలను తమిళనాడుకు తరలించాలని కేంద్రం జీసీ లింక్ ప్రాజెక్ట్ను తలపెట్టింది. ఎప్పుడూ వాటాలకు సంబంధించిన అంశాలే తెరపైకి వచ్చాయే తప్ప.. ‘చత్తీస్గఢ్ వాడుకుంటే..’ అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నం కాలేదు. తాజాగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన రివర్ లింకింగ్ టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్లో నిపుణులు అదే ప్రశ్నను లేవనెత్తారు.
నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతిపై చర్చ సందర్భంగా జీసీ లింక్పైనా చర్చించారు. ఈ సందర్భంగా చత్తీస్గఢ్ ఒకవేళ తన వాటా జలాలను వినియోగించుకుంటే గోదావరి కావేరి లింక్ ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటని ఎన్డబ్ల్యూడీఏ అధికారులను కమిటీ నిపుణులు ప్రశ్నించారు. ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్, ఎన్డబ్ల్యూడీఏలు నీటి లభ్యతపై విరుద్ధమైన లెక్కలు చెబుతున్నాయని టాస్క్ఫోర్స్ కమిటీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 24న హైదరాబాద్ జలసౌధలో రాష్ట్రాలతో నిర్వహించనున్న కన్సల్టెన్సీ మీటింగ్లో అన్ని విషయాలను చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం.
జీసీని పక్కకు పడేసే యోచనేనా..
వాస్తవానికి ఇన్నాళ్లూ చర్చకు రాని పాయింట్ ఇప్పుడే ఎందుకు తెరమీదకు తీసుకొచ్చారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీసీ లింక్లో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు, కర్నాటకకు 17 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించి మిగతా నీళ్లను తమిళనాడు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం వాడుకోవాలని కేంద్రం భావించింది. అయితే, నీటి వాటాలపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. సగం వాటా ఇవ్వాలని పట్టుబడుతున్నది.
దాంతో పాటు మిగతా సభ్య రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లూ పేచీ పెడుతున్నాయి. ఇవన్నీ ఎలాగున్నా.. ఏపీ కోసమే ఇప్పుడు ఈ కొత్త ప్రశ్నను తీసుకొచ్చారా? అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. ఈ ప్రశ్న మాటున జీసీ లింక్ను పక్కనపెట్టేస్తే.. జీబీ (గోదావరి బనకచర్ల) లింక్కు మార్గం సుగమమవుతుందన్న ఉద్దేశంతోనే కొత్త వాదనలను తెరపైకి తెస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి, ఈ నెల 24న నిర్వహించనున్న కన్సల్టెన్సీ మీటింగ్లో జీసీ లింక్పై ఏం తేలుస్తారో వేచి చూడాలి.