
- రియల్ ఎస్టేట్ సంస్థలతో క్విడ్ ప్రో కో
- నీకిది నాకది తరహాలో షేర్లు, బినామీ ఆస్తులు
- 120 ఎకరాల భూమి గుర్తింపు
- 5 రోజుల కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన ఏసీబీ
హైదరాబాద్, వెలుగు:హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అధికారులు ‘క్విడ్ ప్రోకో’ కోణం గుర్తించారు. హెచ్ఎమ్డీఏ అడ్డాగా రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆయన క్విడ్ ప్రోకోకు పాల్పడ్డట్టు ఏసీబీ విచారణలో వెలుగు చూసినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో షేర్స్, బినామీల పేరుతో ఆస్తులు తీసుకున్నట్లు తెలుస్తున్నది. రీజినల్రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఇప్పటికే120 ఎకరాలకు పైగా భూములు, వందల కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో 8 రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. కస్టడీలో భాగంగా సోమవారం ఐదో రోజూ విచారించి చంచల్గూడ జైలుకు తరలించారు.
అక్రమ అనుమతులతో..
బాలకృష్ణ ఇల్లు, రెరా ఆఫీస్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా బినామీల పేర్లతో కూడబెట్టిన ఆస్తులు, రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. సిటీ శివారు ప్రాంతాల్లోని హెచ్ఎమ్డీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి జరిగేలా శివబాలకృష్ణ ప్లాన్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. రాష్ట్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో బినామీల పేరిట షేర్లు, సొంతంగా మరో రెండు కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణకు రియల్ ఎస్టేట్ కంపెనీలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
రేపటితో ముగియనున్న కస్టడీ
కస్టడీ విచారణలో శివబాలకృష్ణ సోదరుడు సునీల్కుమార్ సహా బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్లు బ్యాంక్ లావాదేవీలను వారి ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. ఔటర్ రింగ్రోడ్ చుట్టూ, రీజనల్ రింగ్ రోడ్ వచ్చే చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు,స్నేహితుల పేర్లతో 120 ఎకరాలకు పైగా భూముల రికార్డులను ఏసీబీ అధికారుల సీజ్ చేసినట్లు సమాచారం. బుధవారంతో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో శివబాలకృష్ణకు చెందిన అక్రమాస్తుల చిట్టాను సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.