డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని లక్షల్లో వసూళ్లు.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాజీ పీఎ అరెస్టు..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని లక్షల్లో వసూళ్లు..  కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాజీ పీఎ అరెస్టు..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరున ఎమ్మెల్యేల అనుచరులు, అధికారులు చేసిన దోపిడీ ఒక్కొక్కటిగా బయటికొస్తోంది. నేను ఎమ్మెల్యే పీఏను.. పనైపోతుంది.. ఇల్లు పక్కా.. నాకు ఆ మంత్రి బాగా తెలుసు.. నేను ఆ ఆఫీసులోనే పనిచేస్తాను.. ఇల్లు వచ్చే బాధ్యత నాది.. అంటూ సమాన్యుల నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడిన వారిని ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బుధవారం (జులై 23) ఇదే కేసులో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ క్యాంపు కార్యాలయంలో పనిచేసిన హరిబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

డబుల్ బెడ్ రూములు  ఇప్పిస్తానని చెప్పి పేదల నుంచి లక్షల రూపాయలను హరిబాబు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తనకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడని.. తీరా చూస్తే ఇల్లు రాలేదని రమేష్ అనే బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బోడిమి శెట్టి హరిబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

►ALSO READ | విచారణకు పిలిచి వేధిస్తుండ్రు: సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్

ఈ స్కాంలో 83 మంది బాధితులు ఉన్నట్లు , వారి నుంచి రూ.84 లక్షల వరకు వసూలు చేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో తెలిపారు  బాధితులు. హరిబాబు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, స్కాంలో  మరో వ్యక్తి గడ్డం శ్రీధర్ ముదిరాజ్ పై కేసు నమోదు చేసినట్లు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి.