
ముషీరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన దుబారా వ్యయాలు, అక్రమాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, పైగా అప్పులు పెరిగిపోయాయని, అన్ని శాఖల్లో బకాయిలు పేరుకుపోయాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు, బడ్జెట్కు సంబంధం లేని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ని తొలగించి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన చేసి బీసీ, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించి స్కాలర్ షిప్ పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ నేతలు ఆళ్ల రామకృష్ణ, నీల వెంకటేష్, పి. సుధాకర్, కోట్ల శ్రీనివాస్, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.