
థియేటర్ల బంద్ వివాదం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లకు, ప్రొడ్యూసర్లకు మధ్య మొదలైన ఈ వివాదంలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో మరింత ముదిరింది. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చేదాకా వెళ్ళింది పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై స్పందించిన సీనియర్ నటుడు, డైరెక్టర్ ఆర్. నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు సినిమాపై ఎవరూ కుట్ర చేయలేదని.. పవన్ కళ్యాణ్ ప్రకటన సరికాదని అన్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు. ఇండస్ట్రీ కష్టాలపై మాట్లాడుకుందామని పిలిచి ఉంటే బాగుండేదని అన్నారు నారాయణమూర్తి. థియేటర్ల బంద్ అని ఎవరూ ప్రకటించలేదని.. బంద్ ప్రకటిస్తే మూడు వారాల ముందే నోటీసులు ఇస్తారని అన్నారు నారాయణమూర్తి. టికెట్ రేట్లు పెంచొద్దని కూడా చెప్పామని.. రేట్లు పెంచేస్తే సామాన్యులు థియేటర్లకు ఎలా వస్తారని అన్నారు.
Also Read : పరమపద సోపానం సినిమా నుంచి భూమ్ భూమ్ సాంగ్ రిలీజ్
సింగిల్ థియేటర్లకు పర్సంటేజ్ విధానం కావాలని.. అద్దె విధానం తొలగించాలని ఎప్పుడో డిమాండ్ చేశానని అన్నారు. పర్సంటేజ్ విధానానికి దిల్రాజు ఒప్పుకున్నారని అన్నారు నారాయణమూర్తి. సినీ పరిశ్రమను గౌరవించినందుకు సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని.. ఏపీలోనూ అవార్డులు ప్రకటించాలని కోరారు ఆర్.నారాయణమూర్తి