- యూరప్ నుంచి గోల్డ్, డైమండ్ ఆర్నమెంట్స్ పంపినట్లు ఫేక్ పార్సిల్
- ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరాలు
- ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్, ఫారిన్ గిఫ్ట్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద లక్షా 78 వేల క్యాష్, వైఫై రూటర్,6 సెల్ఫోన్లు,2 పాస్పోర్ట్స్ ను సీజ్ చేశారు. ఈ గ్యాంగ్ వివరాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ బుధవారం వెల్లడించారు.
నైజీరియాలోని అజ్బర్కు చెందిన ఒమెనొని సిల్వెస్టర్(23), అలిమెక్ ఎండురెన్స్ చుక్వుక(23) కొంతకాలం కిందట స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చారు. ఢిల్లీలోని తిలక్నగర్లో ఉంటున్నారు.ఈజీ మనీ కోసం సైబర్ నేరాలకు ప్లాన్ చేశారు.సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపించేవారు.
అందమైన ఫొటో ప్రొఫైల్ డీపీగా పెట్టుకునేవారు. డాక్టర్, బిజినెస్మన్స్గా ప్రొఫైల్ అప్లోడ్ చేసేవారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లకు స్పందించిన వారిని ట్రాప్ చేసేవారు. ఫోన్ కాల్స్ కాకుండా కేవలం చాటింగ్స్తోనే అట్రాక్ట్ చేసేవారు. యువతులను ట్రాప్ చేసి గిఫ్ట్స్ పంపిస్తున్నామని చెప్పి కస్టమ్స్ పేరుతో బెదిరింపు కాల్స్ చేసేవారు. డబ్బులు పంపమని చెప్పి అందినంత దోచుకునేవారు.
డాక్టర్గా పరిచయం చేసుకుని..
మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్కు చెందిన దివ్య(31)కు ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యూరోపియన్ సిటిజన్ అలెక్స్ విలియమ్స్గా ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. యూరప్లో డాక్టర్గా పనిచేస్తున్నట్లు యువతిని నమ్మించాడు. ఫేక్ ఫొటోలను ఆమెకు పంపించాడు. కొన్ని రోజుల పాటు ఇన్స్టాగ్రామ్లో ఆకట్టుకునేలా చాటింగ్ చేశాడు. గిఫ్ట్గా గోల్డ్ ఆర్నమెంట్స్, డబ్బు పంపిస్తున్నట్లు ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత కస్టమ్స్ పేరుతో దివ్యకు ఫోన్ కాల్ వచ్చింది.
ఢిల్లీ ఎయిర్పోస్ట్ కస్టమ్స్ ఆఫీసర్ను మాట్లాడుతున్నానని చెప్పి ఓ వ్యక్తి.. ఆమె ఫోన్ నంబర్,అడ్రెస్ పేరుతో వచ్చిన గిఫ్ట్ ప్యాక్పై కేసులు నమోదు చేసినట్లు తెలిపాడు. కస్టమ్స్ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తారని బెదిరించాడు. కస్టమ్స్ క్లియరెన్స్,సెంట్రల్ డ్యూటీస్ సహా వివిధ ట్యాక్స్ ల కింద డబ్బు చెల్లించి క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పాడు. దీంతో యువతి రూ.3 లక్షల 63 వేలను అతడు చెప్పిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత మళ్లీ డబ్బులు పంపాలని సదరు వ్యక్తి బ్లాక్ మెయిల్ చేయడంతో దివ్య ఫిబ్రవరి 16న రాచకొండ సైబర్ క్రైమ్కు కంప్లయింట్ చేసింది. దర్యాప్తు చేపట్టి పోలీసులు బ్యాంక్ అకౌంట్లు, ఫోన్కాల్స్ ఆధారంగా ఢిల్లీలో ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేశారు.