బీఆర్ఎస్​ హయాంలోనే రాడార్ సెంటర్ కు పర్మిషన్ : మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్​ హయాంలోనే రాడార్ సెంటర్ కు పర్మిషన్ : మంత్రి కొండా సురేఖ
  •  ఇబ్బందులుండవని నిర్ధారణకు వచ్చాకే చివరి అనుమతులు ఇచ్చాం  
  • రాజకీయం చేస్తామంటే.. బీఆర్​ఎస్​ విజ్ఞతకే వదిలేస్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ లో రాడార్ సెంటర్ నిర్మాణానికి బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో 2017లోనే జీవో నెం.44 ద్వారా తుది అనుమతులు ఇచ్చారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తేల్చి చెప్పారు. రాడార్ సెంటర్ ఏర్పాటుతో పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పూర్తిగా నిర్ధారణకు వచ్చాకే కాంగ్రెస్ ప్రభుత్వం చివరి అనుమతులు మంజూరు చేసిందని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం సెక్రటేరియట్ లోని మీడియా సెంటర్ లో.. వికారాబాద్ జిల్లా దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ లో వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను మంత్రి వెల్లడించారు.

రాడార్ సెంటర్ కోసం 2010 లోనే భారత నావికాదళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టిందని, 14 ఏండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగిందని మంత్రి స్పష్టం చేశారు. 2014 ఆగస్టులో బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలోనే భూముల బదలాయింపునకు సంబంధించి డిమాండ్ నోట్ ను నేవీకి పంపించారన్నారు. 2017, ఫిబ్రవరిలో పెరిగిన వేజెస్ కు అనుగుణంగా ప్లాంటేషన్ కు సంబంధించిన స్థల మార్పును సూచిస్తూ నేవీకి మరోసారి ఉత్తరం రాశారని మంత్రి తెలిపారు. అనేక సంప్రదింపుల అనంతరం 2017, డిసెంబర్ 19న జీవో నంబర్ 44 ద్వారా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ భూములను నేవీకి బదిలీ చేసిందని మంత్రి స్పష్టం చేశారు.

గర్వించడం మాని.. రాజకీయాలా?

రాష్ట్రంలో రాడార్ సెంటర్ ఏర్పాటుతో దేశభద్రతలో రాష్ట్రానికి పాత్ర ఉందని గర్వించాలని, కానీ వీధి పోరాటం చేస్తాం, రాజకీయం చేస్తామంటే.. బీఆర్ఎస్ పార్టీ విజ్ఞతకే వదిలివేస్తున్నాని మంత్రి పేర్కొన్నారు.