బోడుప్పల్ ఎస్ఆర్ బాయ్స్ కాలేజీలో ర్యాగింగ్.. పోలీసులకు విద్యార్థి తల్లి ఫిర్యాదు

 బోడుప్పల్ ఎస్ఆర్ బాయ్స్ కాలేజీలో ర్యాగింగ్.. పోలీసులకు విద్యార్థి తల్లి ఫిర్యాదు
  • అమ్మాయిలా ఉన్నావంటూ సెక్సువల్ హరాస్​మెంట్

మేడిపల్లి, వెలుగు: ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్, సెక్సువల్​హరాస్​మెంట్​చేసిన ఘటన బోడుప్పల్​ఎస్ఆర్ బాయ్స్​జూనియర్​కాలేజీలో చోటుచేసుకుంది. బాధితుడు, అతని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరకి చెందిన గంగాధరి గణేశ్(17) మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్​ఫస్టియర్​ఎంపీసీ చదువుతున్నాడు. 

అతన్ని తోటి విద్యార్థులైన మనీష్, జశ్వంత్, ప్రహర్ష హాస్టల్​లో మొదటి నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ పై కొడుతూ.. ఆడపిల్లలా ఉన్నావంటూ సెక్సువల్ హరాస్​మెంట్​చేస్తున్నారు. చివరికి గణేశ్​ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాడు. దీంతో ఆమె, బంధువులు ఆదివారం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. 

తన కొడుకు టెన్త్ లో స్కూల్ టాపర్ అని, ర్యాగింగ్, లైంగిక వేధింపుల కారణంగా డిప్రెషన్​లో ఉంటూ సరిగా మాట్లాడటం లేదని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ హరీశ్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అన్వర్, నాయకులు వారికి మద్దతు తెలిపారు. 

ఇలాంటి కాలేజీలు, విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. అనంతరం గణేశ్​ను స్థానిక ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చేర్పించి, వైద్యం చేయించారు. మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్​మాట్లాడుతూ.. తోటి విద్యార్థులు బాధిస్తున్న విషయాన్ని గణేశ్​తమ దృష్టికి ఎప్పుడూ తీసుకురాలేదన్నారు. 

హాస్టల్​గదిలో అతను, మరో విద్యార్థి కొట్టుకున్నారని విద్యార్థులు తెలిపారని, ఇబ్బంది పెడున్నారని చెబుతున్న పిల్లల తల్లిదండ్రులను కూడా రమ్మని చెప్పామని పేర్కొన్నారు. వారి వివరణ తీసుకున్నాక తదుపరి చర్యలుంటాయని చెప్పారు.