- రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి
- ఆరు స్వదేశీ యూఏవీలు లాంచ్
హైదరాబాద్, వెలుగు: రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూప్ తన కొత్త బ్రాండ్ ఆరోబోట్ ద్వారా రక్షణ తయారీని విస్తరించింది. హైదరాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో నిర్మించిన డెవలప్మెంట్, ప్రొడక్షన్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ క్యాంపస్ను సోమవారం ప్రారంభించింది. దీనికోసం రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఆరో బ్రాండ్ పేరుతో రూపొందించిన ఆరు మానవరహిత, అటానమస్ డిఫెన్స్ ప్లాట్ఫారమ్లను ఆవిష్కరించింది.
జెట్-శక్తితో నడిచే లాయిటరింగ్ మందుగుండు సామగ్రి, టార్గెట్ డ్రోన్లు, లాంగ్ -ఎండ్యూరెన్స్ కమికేజ్ యూఏవీలు, అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ (యుజీవీలు) వీటిలో ఉన్నాయి. వీటి ఆపరేషనల్ పరిధి 300 కిలోమీటర్లు. ఈ గ్రూప్ 515 ఆర్మీ బేస్ వర్క్షాప్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), ఐఐఐటీ హైదరాబాద్, ఏఆర్సీఐ సంస్థలతో నాలుగు ఎంఓయూలు కుదుర్చుకుంది.
ఇదిలా ఉంటే, హైదరాబాద్ హార్డ్వేర్ పార్క్లో రూ.300 కోట్ల పెట్టుబడితో యూఏవీలు, ఇంజిన్లు, అధునాతన రక్షణ వ్యవస్థల కోసం డిజైన్- టు- అసెంబ్లీని నిర్మిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
