జనసంద్రంగా భారత్ జోడో యాత్ర

జనసంద్రంగా భారత్ జోడో యాత్ర

మెదక్/ పెద్దశంకరంపేట్/నారాయణఖేడ్, వెలుగు : వణుకు పుట్టించేలా చలి పెడుతున్నా, పొగమంచు కురుస్తున్నా లెక్క చేయకుండా పొద్దున ఆరు గంటలకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగించారు. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర కొద్దిసేపులోనే జనసంద్రంగా మారింది.  మొదటి విడతగా పెద్ద శంకరంపేట్ మండలం కమలాపూర్ యాత్ర సాగింది. విరామం తరువాత నారాయణ్ ఖేడ్ మండలం నిజాంపేట్ వరకు కారులో వెళ్లి అక్కడి నుంచి జిల్లా బార్డర్ లోని మహాదేవ్ పల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. దారి పొడువునా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు  పెద్ద జెండాలు, నాగళ్లతో రాహుల్ గాంధీకి వెల్​కం చెప్పి ఆయనతో  పాటు నడిచారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.

ఎంఆర్ పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ కొల్లపల్లి వద్ద జోడో యాత్రలో జాయిన్ అయి రాహుల్ తో కలిసి కొంతదూరం నడిచారు. పెద్దశంకరంపేటలో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో రాహుల్ పాల్గొన్నారు. ఆ తరువాత అక్కడే సివిల్ కాంట్రాక్టర్ కోయిల కొండ్ల యాదగిరి ఇంట్లో  జై రామ్ రమేశ్, రేవంత్ రెడ్డి, సీతక్కతో కలిసి ఆయన టీ తాగారు. యాదగిరి మనుమడు కార్తవీర అరుదైన హైపో డైఫోక్లాసెస్ వ్యాధితో బాధ పడుతున్నట్టు తెలుసుకొని మెరుగైన చికిత్స అందేలా చూస్తామని రాహుల్​ హామీ ఇచ్చారు. పెద్ద శంకరం పేటలో యాత్రలో రద్దీ ఎక్కువై తోపులాట జరగడంతో మాజీ సర్పంచ్ జై హింద్ రెడ్డి కిందపడి చేయి ఫ్రాక్చర్ అయ్యింది. ఈ విషయం తెలిసి రాహుల్ ఆయనను పరామర్శించారు. ఆ తరువాత మార్గ మధ్యంలో బీడీ కార్మికులు, చెరుకు రైతులు,  సింగరేణి కార్మికులు తమ సమస్యలను రాహుల్ కు విన్నవించారు. పెద్దశంకరంపేట్ మండలం కమలాపూర్ సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలు  500 మీటర్ల పొడవైన జాతీయ జెండా ప్రదర్శించారు. నిజాంపేట్ లో గిరిజన మహిళలు నృత్యాలతో, మహిళలు బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. కుమ్మరులు మట్టితో కుండ చేసే విధానాన్ని పరిశీలించారు. ఎడ్ల బండి ప్రదర్శనను తిలకించారు.

ఈనెల 2న సంగారెడ్డి జిల్లా లింగంపేట్ వద్ద మొదలైన జోడో యాత్ర సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఐదు రోజుల పాటు దాదాపు 90 కిలో మీటర్ల మేర కొనసాగి సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలం మాసాన్ పల్లి వద్ద ముగిసింది. అక్కడి నుంచి రాహుల్ గాంధీ కామారెడ్డి జిల్లాలోని పెద్ద కొడప్ గల్ కు వెళ్లి పోయారు. యాత్రలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ నాయకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, టి.సుబ్బిరామి రెడ్డి, సురేశ్​షేట్కార్, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సంపత్, నారాయణ ఖేడ్ సెగ్మెంట్ నాయకులు సంజీవరెడ్డి పాల్గొన్నారు.