న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ పెద్ద దోపిడీ యంత్రాంగం మాదిరిగా తయారైందని కాంగ్రెస్ లీడర్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలంటే ఆ రంగంలో విప్లవం తీసుకురావాల్సిన అవసరముందని సోమవారం ఎక్స్లో కామెంట్ చేశారు.
భవిష్యత్ను తీర్చిదిద్దాల్సిన విద్యావ్యవస్థ.. పిల్లలను ఒత్తిడి, నిరాశల వైపు నెడుతోందని, వారి తల్లిదండ్రులను అప్పుల పాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అవినీతిమయం అయిపోయిందని విద్యార్థులే అంటున్నారని, ఆ అవినీతే క్వశ్చన్ పేపర్ల లీకేజీ మాఫియా ఏర్పడేందుకు కారణమైందని మండిపడ్డారు. అవినీతి, మాఫియా వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఏండ్ల తరబడి పడిన కష్టం ఒక్కసారిగా వృథా అవుతోందన్నారు.
లీకేజీ వ్యవహారాల్లో బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులు టెండర్లు, పదోన్నతులు పొందుతున్నారని, శిక్ష మాత్రం విద్యార్థులకే పడుతోందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పరిస్థితులన్నింటినీ చూస్తూ కూడా మౌనం పాటిస్తున్నారని, బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
విద్యా రంగంలో విప్లవం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ నెల 17న డెహ్రాడూన్లో నిర్వహించనున్న ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ గొంతును మరింత బలంగా వినిపించాలని రాహుల్ పిలుపునిచ్చారు.
