- అన్నిటినీ మోదీ తన అనుచరులకు కట్టబెడ్తున్నరు
- దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ దెబ్బతింటున్నదని వ్యాఖ్య
- జర్మనీలో బీఎండబ్ల్యూ ప్లాంట్ విజిట్
న్యూఢిల్లీ/మ్యూనిచ్: కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతి రంగంలోనూ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నదని.. చిన్న, మధ్య తరగతి వ్యాపారులను పన్నులతో ఆగం చేస్తున్నదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ మండిపడ్డారు. దేశానికి వెన్నెముక అయిన ఎంఎస్ఎంఈ(మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) ఇండస్ట్రీలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తున్నదని.. ఆయా ఇండస్ట్రీల్లో కూడా అనుచరులకు పెద్దపీట వేస్తున్నదని అన్నారు.
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద రోడ్డు పక్కన ఐస్క్రీమ్ బండ్లతో ఎంతో మంది పొట్టపోసుకునే వారని.. కానీ, ఇప్పుడు అవి కూడా కనిపించకుండా చిన్న ఐస్క్రీమ్ కంపెనీలపై మోదీ సర్కార్ పన్నుల మోత మోగిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. దేశంలో మాన్యుఫాక్చరింగ్ రంగం దెబ్బతింటున్నదని వ్యాఖ్యానించారు. జర్మనీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. బుధవారం రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇటీవల పార్లమెంట్ ఆవరణలో తనను చిన్న, మధ్య తరగతి ఐస్క్రీమ్ కంపెనీల ప్రతినిధులు కలిశారని, వారి సమస్యలు చెప్పుకొని బాధపడ్డారని మొదటి వీడియోలో పేర్కొన్నారు. జర్మనీలోని మ్యూనిచ్లో బీఎండబ్ల్యూ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను సందర్శించిన విశేషాలతో మరో వీడియో రిలీజ్ చేశారు.
చిన్న వ్యాపారులపై జీఎస్టీ దెబ్బ
చిన్న, మధ్యతరగతి వ్యాపారులు ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని.. అలాంటి వారిని మోదీ సర్కార్ దెబ్బతీస్తున్నదని రాహుల్ అన్నారు. అన్ని రంగాల్లో మోనోపలీ చెలరేగిపోతున్నదని, కావాల్సిన వాళ్లకు ప్రయోజనాలు చేకూరుస్తూ.. సామాన్యులను మోదీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
దెబ్బతింటున్న తయారీ రంగం
జర్మనీ పర్యటనలో ఉన్న రాహుల్గాందీ.. అక్కడి మ్యూనిచ్లోని బీఎండబ్ల్యూ ప్లాంట్ను సందర్శించారు. కార్లను, బైక్లను ఆసక్తిగా తిలకించారు. అందులో ఉంచిన టీవీఎస్ 450 సీసీ మోటర్ సైకిల్ను చూసి ఫిదా అయ్యారు. భారత ఇంజనీరింగ్ సహకారంతో బీఎండబ్ల్యూ ఇది రూపొందించడం.. ఇక్కడ భారత జెండా ఎగురుతుండడం ఆనందంగా ఉందని వీడియోలో రాహుల్ పేర్కొన్నారు. అదే సమయంలో.. భారత తయారీ రంగాన్ని మోదీ సర్కార్ పట్టించుకోవడంలేదని విమర్శించారు.
రాహుల్.. వాస్తవాలు తెలుసుకో: బీజేపీ
దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ రంగం దెబ్బతింటున్నదన్న రాహుల్గాంధీ కామెంట్లపై బీజేపీ మండిపడింది. విదేశాలకు వెళ్లిన ప్రతిసారి దేశం గురించి తప్పుగా మాట్లాడటం రాహుల్కు అలవాటైందని విమర్శించింది. ‘‘ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం రాహుల్కు అలవాటైంది” అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ మండిపడ్డారు. ‘‘పదేండ్లలో మన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగం 495 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
ఎగుమతుల్లోనూ 760 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. వాస్తవాలను, లెక్కలను తెలుసుకొని రాహుల్ మాట్లాడాలి. 1991తో పోల్చుకుంటే ఇప్పుడు 14 రెట్లు గ్రోత్తో ఇండియా దూసుకుపోతున్నది. 1991లో వెహికల్ ప్రొడక్షన్ యూనిట్స్ 2 మిలియన్స్ఉంటే.. 2024 నాటికి అవి 28 మిలియన్స్కు చేరాయి. 2047 నాటికి 200 మిలియన్స్ వెహికల్స్ను ప్రొడ్యూస్ చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో ఆటోమొబైల్ రంగంలో మన దేశం టాప్ 2 స్థానానికి చేరుతుంది. ఈ విషయాన్ని రాహుల్ గుర్తించాలి” అని ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
