న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. డిసెంబర్ 9 నుంచి ఆయన ఫారిన్ టూర్కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇండోనేషియా, సింగపూర్, మలేసియా, వియత్నాం దేశాల్లో రాహుల్ పర్యటించనున్నారని సమాచారం. సింగపూర్, మలేసియా దేశాల్లోని ప్రవాస భారతీయులతో ఆయన సమావేశం కానున్నారు. ఇండోనేషియాలోని దౌత్యవేత్తలతో కూడా రాహుల్ భేటీ కానున్నారు.
వియత్నాంలో కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్తో కూడా సమావేశం అవుతారు. డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కాగా, గతంలోనూ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లారు.
మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ గాంధీకి సుల్తాన్పూర్ ఎంపీ, ఎమ్మెల్యేల సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. 2018లో బెంగళూరులో నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో రాహుల్ మాట్లాడుతూ, అమిత్ షా హంతకుడు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయ్ మిశ్రా కోర్టులో ఫిర్యాదు చేశారు.