రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్
మందమర్రి, వెలుగు: దేళ్ల తర్వాత సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవల ఎన్నికలు నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం సంసిద్ధత వ్యక్తంచేసింది. దీంతో కోల్బెల్ట్ వ్యాప్తంగా గనులపై హడావిడి కనిపిస్తోంది. ఎన్నికలు జరపాలని జాతీయ కార్మిక సంఘాలు పట్టుబడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎన్నికల నిర్వహణపై చర్చించుకుంటున్నారు. ఈ టైమ్లో ఎన్నికలు పెడితే రాజకీయంగా తమకు లాభమా నష్టమాఅని ఆలోచిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర సర్కారునిర్ణయమే ఫైనల్ అయినా జాతీయ సంఘాల డిమాండ్తో ఎన్నికలకు ఒప్పుకోకతప్పేలాలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
రాష్ట్ర సర్కార్ నిర్ణయమే కీలకం
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కలిసి నిర్వహించాల్సిఉన్నప్పటికీ .. స్టేట్ నిర్ణయమే ప్రధానం కానుంది. బొగ్గు గనులు విస్తరించిన ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాది కోత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించవలసిఉంటుంది. పోలింగ్, కౌంటింగ్ బందోబస్తు కోసం పోలీసు బలగాలను దింపాలి. ఇదంతా రాష్ట్ర సర్కారే చేయాలి. కార్మికులకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, సింగరేణిలో రాష్ట్ర సర్కార్ రాజకీయ జోక్యం, ప్రజాప్రతినిధుల ప్రభావం, సంస్థ నిధులు వేల కోట్లు రాష్ట్ర సర్కార్ మళ్లించడం, కీలక నేతలు వలసలు తదితర అంశాలు టీఆర్ఎస్ను ఆలోచనలో పడేస్తున్నాయి. ఆరు జిల్లాల పరిధిలోని మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, రామగుండం, మంథని, కొత్తగూడెం, ఇల్లందు, వైరా, పినపాక, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సింగరేణి ఓట్లే కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా.. కోల్బెల్ట్ ఏరియాలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంది. కేవలం మూడు చోట్ల మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 11 ఏరియాలకుగాను తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ గెలిచింది. ఆ తర్వాత ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు కూడా సింగరేణి ఏరియాలో అధికారపార్టీ మీద వ్యతిరేకత ఉన్నట్టుసర్వేల్లో తేలినట్టు తెలిసింది. ఈ టైమ్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని టీ ఆర్ఎస్ పెద్దలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడవచ్చునని భయపడ్తున్నారు. దీంతో గుర్తింపు ఎన్నికలపై రాష్ట్ర సర్కార్ అంతగా ఆసక్తి చూపడంలేదు. సర్కారు నుంచి గ్రీన్సిగ్నల్ఇస్తే మాత్రం కేంద్ర కార్మికశాఖ ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
సింగరేణి వైపు ఓకే..
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని కొంతకాలంగా కార్మికశాఖపై జాతీయ కార్మిక సంఘాలు ఒత్తిడితెస్తున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు ఓకే చెప్తూ రాష్ట్ర ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈనెల 8న సింగరేణి సీఎండీ లెటర్ రాశారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగినందున ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 2017 అక్టోబర్5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిచింది. గుర్తింపు సంఘం గడువు 2019 అక్టోబర్4తో ముగిసినందున ఎన్నికల నిర్వహించాలని కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్కమిషనర్ గతంలోనే లేటర్ రాశారని, కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నికలు పెట్టలేకపోయామని, ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామని సీఎండీ తమ లేఖలో పేర్కొన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితిని మూడేళ్లకు పెంచాలని టీబీజీకేఎస్ కోర్టులో కేసు వేయడం, కరోనా, బొగ్గు ఉత్పత్తి తదితర కారణాలతో 2019 తర్వాత ఎన్నికలు తరచూ వాయిదా పడుతూ వచ్చాయి. 2021 మార్చి తర్వాత ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉన్నట్టు భావించినా కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల యాజమాన్యం ఎన్నికల వాయిదా కోరింది.