చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రేపటి ( సెప్టెంబర్ 15) నుంచి సెలవులో వెళ్తున్నారు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవులోకి ఉండనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఇంచార్జ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇలాంటి వేళ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పరిశీలించారు.
ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించారు. అలాగే ఇంటి భోజనం అందించేందుకు అనుమతి ఇస్తున్నారు. అయితే జైలులో చంద్రబాబు భద్రతపై ఆయన తరఫు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయన సతీమణి భువనేశ్వరి.. జైలులో చంద్రబాబుకు నెంబర్ వన్ సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. ఆయన భద్రతపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు జైలులో ఉండగానే సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.