న్యూఢిల్లీ: రాజస్తాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్పై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించి డగౌట్లో మొబైల్ వాడినందుకు అతనిపై రూ. 1 లక్ష జరిమానా విధించింది. తొలి తప్పు కావడంతో నిషేధం లేకుండా కేవలం ఫైన్తో సరిపెట్టింది. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించింది.
ఈ మేరకు బోర్డు నిర్ణయాన్ని సెక్రటరీ దేవజిత్ సైకియా శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 10న గువాహటిలో రాజస్తాన్, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా భిందర్ డగౌట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ వాడుతూ కనిపించాడు. దీనిపై ఐపీఎల్ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు ఫిర్యాదు చేశారు. శరత్ కుమార్ నేతృత్వంలోని ఏసీయూ బృందం విచారణ తర్వాత బోర్డు అతనిపై చర్యలు తీసుకుంది.

