IND vs ENG: పటిదార్‌కు మరో అవకాశం.. చివరి టెస్టులోనూ పడికల్‌కు నిరాశే

IND vs ENG: పటిదార్‌కు మరో అవకాశం.. చివరి టెస్టులోనూ పడికల్‌కు నిరాశే

ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్ లో చాలా మంది కొత్త ప్లేయర్లు అరంగేట్రం చేశారు. రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్‌లు భారత జట్టు తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు. వీరిలో పటిదార్ మినహా మిగిలిన వారందరూ తమని తాము నిరూపించుకున్నారు. సాధారణంగా భారత జట్టులో అవకాశాలు రావడం చాలా అరుదు. కానీ పటిదార్ మాత్రం వరుస అవకాశాలు వస్తున్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దీంతో ఈ మధ్య ప్రదేశ్ ఆటగాడిపై వేటు పడటం ఖాయంగా అనుకున్నారు. 

రంజీల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న దేవ్ దత్ పడికల్ కు చివరి టెస్టులో ఆడే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. అయితే తాజా సమాచారం ప్రకారం విఫలమైనా.. పటిదార్ కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. డివిలియర్స్ తో పలు మాజీ ఆటగాళ్లు ఈ ఆర్సీబీ ఆటగాడిపై నమ్మకం ఉంచాల్సిందిగా కోరారు. భారత యాజమాన్యం కూడా కొత్త ప్లేయర్ ను తీసుకొచ్చి కీలకమైన మిడిల్ ఆర్డర్ లో ఆడించడం రిస్క్ అవుతున్నట్లు భావిస్తోందట. దీనికి తోడు పడికల్ ఓపెనర్ కావడం అతనికి ప్రతికూలంగా మారింది. 

కోహ్లీ, రాహుల్ గాయాలతో లక్కీగా జట్టులో చోటు దక్కించుకున్న ఈ మధ్య ప్రదేశ్ ఆటగాడు ఆడిన మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ ల్లో 63 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్టులో 32 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా.. 9,5, 0,17, 0 స్కోర్లు నమోదు చేశాడు. ఆడిన ఆరు ఇన్నింగ్సుల్లోనే రెండు సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో నెటిజన్స్ ఈ ప్లేయర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సిరీస్‌ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులోనే రెండు హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. రాంచీ టెస్టులో అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మర్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో ఐదో టెస్ట్ జరుగుతుంది.