- సా. 6 నుంచి సోనీ స్పోర్ట్స్–1, 4లో లైవ్
బెల్ఫాస్ట్: ఐర్లాండ్తో రెండో టీ20 మ్యాచ్కు ఇండియా టీమ్ రెడీ అయ్యింది. తొలి మ్యాచ్లో ఊహించని ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆదివారం జరిగే ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో .. ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 1–1తో ముగించాలని పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్లో ఘోరంగా ఫెయిలైన టాప్ ఆర్డర్పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ధాటిగా ఆడినా.. రెండో ఎండ్లో సరైన సహకారం దక్కలేదు. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే కూడా బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. కాబట్టి వీళ్లు త్వరగా ఫామ్లోకి రావాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్లోనూ బెంచ్కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.
టాప్ ఆర్డర్లో మార్పులు చేయడానికి శ్రేయస్ సుముఖంగా లేకపోవడం ఇందుకు కారణం. ఒకవేళ వైభవ్ను తీసుకుంటే శాంసన్ను కిందకు దించాల్సి ఉంటుంది. బౌలింగ్లో ఇండియా ఫర్వాలేదనిపిస్తోంది. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పేసర్ హర్షిత్ రాణా ఫామ్లోకి వచ్చాడు. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ కూడా రన్స్ కట్టడి చేశారు.
అయితే డెత్ ఓవర్లలో సుందర్, ప్రసిధ్ కృష్ణ దారుణంగా ఫెయిలయ్యారు. ఈ ఇద్దరు కలిసి రెండు ఓవర్లలో 30 రన్స్ ఇవ్వడంతో ఐర్లాండ్ పుంజుకుంది. కాబట్టి ఈ మ్యాచ్లో వీళ్లు సత్తా చాటాల్సిందే. మరోవైపు ఏ ఫార్మాట్లోనైనా ఇండియాపై తొలి విజయం సాధించిన ఐర్లాండ్ మంచి జోరుమీదుంది.
ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కెప్టెన్ లోర్కాన్ టకెర్, గారెత్ డెలానీ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. మిగతా బ్యాటర్లు కూడా తలా కొన్ని రన్స్ చేస్తే ఇండియాకు ఇబ్బందులు తప్పవు. బౌలర్లలో మాథ్యూ హంఫ్రీస్, హోలార్డ్ నుంచి ముప్పు తప్పదు.
