అమ్మకానికి రాజీవ్ స్వగృహ టవర్స్.. లాటరీ విధానంలో కేటాయింపు

అమ్మకానికి రాజీవ్ స్వగృహ టవర్స్.. లాటరీ విధానంలో కేటాయింపు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్‭ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు సంబంధించిన టవర్లను అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విక్రయించే బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. వీటికి సంబంధించి ఇప్పటికే హెచ్ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా రేపు హెచ్ఎండిఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఫ్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హిమాయత్ నగర్, ఉర్దూగల్లీలో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాలులో ఈ ఫ్రీ బిడ్ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.

పోచారంలో 9 అంతస్తుల నాలుగు 4 టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్‭లో కనీసం 72 నుంచి 198 ప్లాట్లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అలాగే.. గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు టవర్లు ఉండగా  వాటిల్లో ఒక్కొక్క టవర్‭లో 112 ప్లాట్లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి గల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు.. జనవరి 30 నాటికి రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ధరా వత్తు చెల్లించిన దరఖాస్తుదారుల ఎంపిక పారదర్శకంగా చేసి.. లాటరీ విధానం ద్వారా టవర్లను కేటాయిస్తారు. ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు రేపు జరిగే ఫ్రీ బిడ్ సమావేశానికి హాజరై ఇతర వివరాలను తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు.