- కన్ఫర్మేషన్ ఆర్డర్లో టవర్ నంబర్ వేయని అధికారులు
- నంబర్ లేకుంటే లోన్ ఇవ్వలేమంటున్న బ్యాంకులు
- దిక్కుతోచని స్థితిలో టోకెన్ అమౌంట్ చెల్లించిన లబ్ధిదారులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ గృహ కల్ప ఫ్లాట్ల లాటరీలో అదృష్టం వరించినా.. లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేవు. 10 శాతం టోకెన్ అమౌంట్ కట్టిన లబ్ధిదారులకు హెచ్ఎండీఏ అధికారులు జారీ చేసిన ఫ్లాట్ కన్ఫర్మేషన్ ఆర్డర్లో టవర్ నంబర్ లేకపోవడంతో లోన్ ఇచ్చేందుకు బ్యాంకు ఆఫీసర్లు ముందుకు రావడం లేదు. అలాగే మరికొందరికి ఐటీ రిటర్న్ చెల్లించినట్లు సర్టిఫికెట్లు లేకపోవడంతో లోన్ ఇవ్వడం కుదరదని బ్యాంకర్లు తెగేసి చెప్తున్నారు. దీంతో ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోన్ ఇస్తే నెలనెలా ఏదో ఒక పని చేసుకుని కిస్తీలు కట్టేవాళ్లమని, కానీ లోన్ రాకపోతే ఎలా చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కట్టిన పైసలు వచ్చేనా..?
హైదరాబాద్లో 12 ఏండ్ల కింద నిర్మించిన బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను అమ్మకాని పెట్టగా 39వేల అప్లికేషన్లు వచ్చాయి. 3 రోజుల పాటు ఓపెన్ లాటరీ తీసి ఫ్లాట్లకు లబ్ధిదారులను సెలక్ట్ చేశారు. వీరి లిస్టును హెచ్ఎండీఏ వెబ్ సైట్ లోనూ పెట్టారు. వారు దక్కించుకున్న ఫ్లాట్ నంబర్, టవర్ నంబర్ వివరాలను ఇంటిమేషన్ లెటర్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్లాట్ మొత్తం వ్యాల్యూలో 10శాతం డబ్బును టోకెన్ అడ్వాన్స్గా చెల్లించినవాళ్లకు కన్ఫర్మేషన్ లెటర్ కూడా ఇచ్చారు. ఇక్కడే రాజీవ్ స్వగృహ అధికారులు చేసిన నిర్లక్ష్యం లబ్ధిదారులకు శాపంగా మారింది. ఆ లెటర్లో ఫ్లాట్ నంబర్ మాత్రమే ఉండడం, టవర్ నంబర్ లేకపోవడంతో అందులో వివరాలు సరిగా లేవని, వాటితో లోన్ ఇవ్వడం కుదరదని బ్యాంక్ ఆఫీసర్లు చెప్తున్నారు.
ఆందోళనలో లబ్ధిదారులు
ఈ విషయమై రాజీవ్ స్వగృహ అధికారులను వివరణ కోరగా మొదట ఇచ్చిన ఇంటిమేషన్ లెటర్లో టవర్, ఫ్లాట్ నంబర్ రెండూ ఉన్నాయని, ఆ లెటర్ లోన్కు సరిపోతుందని దాటవేస్తున్నారు. ఇదే విషయాన్ని లబ్ధిదారులు వెళ్లి బ్యాంకు ఆఫీసర్లకు చెప్తే.. 10 శాతం టోకెన్ అడ్వాన్స్ కట్టనివారి దగ్గర కూడా ఇంటిమేషన్ లెటర్లు ఉన్నాయని, వాటి ఆధారంగా లోన్ ఇవ్వలేమంటున్నారు. దీంతో టోకెన్ అమౌంట్ చెల్లించిన లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. తాము అనవసరంగా టోకెన్ అడ్వాన్స్ కట్టామేమోనని, ఒకవేళ 80 రోజుల్లోపు లోన్ రాకపోతే రూ.3లక్షల నుంచి
రూ.1లక్ష వరకు కట్టిన టోకెన్ అడ్వాన్స్ రాకుండా పోతుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలియడంతోనే చాలా మంది లబ్ధిదారులు టోకెన్ అమౌంట్ చెల్లించేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది.
అధికారులు పట్టించుకోవట్లే..!
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు లాటరీ తీసి లబ్ధిదారులను సెలక్ట్ చేసిన అధికారులు.. ఆ తర్వాత వారికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు జులై12ను గడువుగా విధించిన అధికారులు.. ఎంపికైన వారికి ఇంటిమేషన్ లెటర్లను మాత్రం 12వ తేదీ తర్వాతే పంపడం విమర్శలకు తావిస్తోంది. వెబ్సైట్లో చెక్ చేసుకుంటే తప్పా తమకు ఫ్లాట్లు అలాట్ అయిన విషయం తమకు తెలియలేదని, తమ సెల్ ఫోన్లకు కనీసం మెసేజ్లు, ఫోన్లు కూడా రాలేవని, అందుకే చాలా మంది ఇప్పటి వరకు టోకెన్ అడ్వాన్స్ కూడా కట్టలేదని బోడుప్పల్ చెందిన ఓ లబ్ధిదారుడు మండిపడ్డారు. అలాగే బ్యాంకు లోన్లు, అపార్ట్మెంట్స్ లో వసతులు, ఆ ఫ్లాట్లపై గతంలో ఉన్న నల్లాబిల్లుల విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతోనే టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు గడువులోగా సగం మంది కూడా రాలేదని తెలుస్తోంది. అందుకే గడువును 30వ తేదీ వరకు పెంచినట్లు సమాచారం. రాజీవ్ గృహకల్ప ఆఫీసర్లు జోక్యం చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.