
ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ ప్రయోగం సక్సెస్ అవుతుందని స్పేస్లోకి వెళ్లిన మొదటి భారతీయుడు, వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. 2022లో చేసే ఈ ప్రయోగం సవాళ్లతో కూడుకున్నదే అయినా తప్పక విజయం సాధిస్తామని ఆయన అన్నారు. ‘‘మనకు ఏదైనా సాధ్యమే. మనిషిని స్పేస్లోకి పంపించడమన్నది సవాళ్లతో కూడుకున్నదే. వాటికి తగ్గట్టే ఇస్రో పనిచేస్తోంది. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. మనిషిని పంపే క్యాప్సూల్ రెడీ అయిపోతోంది.
ప్యాడ్ అబార్ట్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. గగన్యాన్ కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది” అని ఆయన అన్నారు. ప్రయోగానికి తనవంతు సలహాలు ఇస్తున్నానని ఆయన చెప్పారు. 1984 ఏప్రిల్ 2న సోవియట్ యూనియన్ (రష్యా) సోయజ్ టీ11 ప్రయోగంలో రాకేశ్ శర్మ స్పేస్లోకి వెళ్లారు. ప్రస్తుతం గగన్యాన్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నారు.