నల్గొండ, వెలుగు: మిర్యాలగూడ డివిజన్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రోగ్రాంను ఆదివారం పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మి ఆధ్వర్యంలో కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించారు. రెండో విడత మిర్యాలగూడ డివిజన్లోని అడవిదేవులపల్లి ,అనుముల, దామరచర్ల ,మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం ,వేములపల్లి మండలాలలోని 2,418 పోలింగ్ కేంద్రాలలో రెండవ విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు 2898 మంది పీవోలు, 3334 మంది ఓపిఓలు అవసరం కాగా, ఆ మేరకు ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 2418 టీములు ఈ రెండవ విడత ఎన్నికలలో విధులు నిర్వహించనున్నాయి. ఈ ప్రోగ్రాంలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పీ సీఈఓ శ్రీనివాస రావు, డీఈఓ భిక్షపతి హాజరై ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
