గణేశ్ నిమజ్జనానికి 44 చెరువులు.. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి

గణేశ్ నిమజ్జనానికి 44 చెరువులు.. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: గణేశ్​ ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనోత్సవానికి రంగారెడ్డి జిల్లాలో 44 చెరువులను గుర్తించినట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో ఆయన గణేశ్​ పండుగపై సమీక్షించారు. వినాయక మండపాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. 

నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా గుంతలు పడిన రహదారులపై ప్యాచ్ వర్క్ చేయాలని అధికారులను ఆదేశించారు. మండపాల వద్ద ఫాగింగ్, శానిటేషన్ పై దృష్టి పెట్టాలన్నారు. కిందికి వేలాడుతున్న విద్యుత్  వైర్లను సరిచేయాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్,  శంషాబాద్ అడిషనల్ డీసీపీ కె.రామ్ కుమార్, మాదాపూర్ అడిషనల్ డీసీపీ సాయిరామ్  పాల్గొన్నారు.

చెరువుల వద్ద ఏర్పాట్లు చేయండి..

శామీర్​పేట: తూంకుంట మునిసిపల్​ ఆఫీసులో పోలీస్​, ఇరిగేషన్, విద్యుత్​, ఆర్​అండ్​బీ, హెల్త్​ ఆఫీసర్లతో మునిసిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి సమావేశమయ్యారు. గణేశ్​ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. శామీర్ పేట పెద్ద చెరువుతో పాటు మునిసిపల్​ పరిధిలోని చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఇందుకు అధికారులంతా 
సహకరించాలని కోరారు.