రంగారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులోఉద్యోగి ఆత్మహత్య కేసులో ట్విస్ట్..వేధింపులతో వల్లే సూసైడ్ చేసుకున్నాడని భార్య ఆరోపణ

రంగారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులోఉద్యోగి ఆత్మహత్య కేసులో ట్విస్ట్..వేధింపులతో వల్లే సూసైడ్ చేసుకున్నాడని భార్య  ఆరోపణ
  •     ఫోర్జరీ చేసి రూ.33 లక్షలు మాయం చేశాడని ఆఫీసర్​ఫిర్యాదు
  •     నలుగురు తెలంగాణ గ్రామీణ బ్యాంక్​ మేనేజర్లపైనా కేసు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి కలెక్టరేట్​లోని డిస్ట్రిక్ట్​ ట్రైబల్​ వెల్ఫేర్  ఆఫీసర్​ కార్యాలయంలో పని చేస్తూ ఈ నెల 1న ఆత్మహత్య చేసుకున్న ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయ్  వడ్త్యా శ్రీధర్ బాబు కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. చెక్కులపై తన సంతకాలు ఫోర్జరీ చేసి రూ.33 లక్షలు మాయం చేశాడని జిల్లా ట్రైబల్  వెల్ఫేర్​ ఆఫీసర్  ఈ నెల 10న కంప్లైంట్​​చేయడం చర్చనీయాంశమైంది. పైగా ఇందులో ముగ్గురు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ల పాత్ర ఉందంటూ, వారిపైనా కేసు నమోదు చేయడం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. 

భార్య ఏమంటుందంటే..

రంగారెడ్డి డిస్ట్రిక్ట్​ ట్రైబల్​ వెల్ఫేర్  ఆఫీసర్​ కార్యాలయంలో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగిగా పని చేసే శ్రీధర్ బాబు ఈ నెల 1న తుర్కయాంజాల్​లోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తన భర్తను జూనియర్​ అసిస్టెంట్​ కమ్​ లోన్​ ఇన్స్​పెక్టర్  శ్రీనివాస్​నాయుడు ఫోన్​ చేసి వేధించడంతోనే సూసైడ్​ చేసుకున్నాడని మృతుడి భార్య సరోజ ఆదిభట్ల పీఎస్​లో అదే రోజు ఫిర్యాదు చేశారు. అయితే, 8 రోజుల తర్వాత శ్రీనివాస్  నాయుడును అధికారులు సస్పెండ్​ చేశారు. 

 శ్రీధర్​బాబు ఫోర్జరీ చేశాడని కంప్లైంట్..

మళ్లీ ఈనెల 10న జిల్లా గిరిజనాభివృద్ధి ఆఫీసర్​ రామేశ్వరి చెక్కులపై తన సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు మాయం చేశారని ఆదిభట్ల పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ప్రకారం.. శంషాబాద్​ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జిల్లా గిరిజన ఆర్థిక సహకార సంస్థ(ట్రైకార్) అకౌంట్​ ఉందని, పదేండ్లుగా ఇన్​యాక్టివ్​గా ఉండడంతో ఆరు నెలల కింద యాక్టివేట్​ చేయాలని కోరారు. 

యాక్టివేట్​ చేసిన తర్వాత చెక్​ బుక్​ వచ్చింది. దానిని శ్రీధర్​బాబు రిసీవ్​ చేసుకొని డిసెంబర్​ నుంచి మే 20 వరకు ఇతర జిల్లాల్లోని బ్యాంకుల బ్రాంచుల నుంచి రూ.33 లక్షలు బదిలీ చేసుకున్నాడని తెలిసింది. దీంతో కలెక్టర్​కు చెప్పగా, విచారణకు ఆదేశించారు. 

అందులో అదిలాబాద్​ జిల్లాలోని హస్నాపూర్ టీజీబీ నుంచి రూ. 20.45 లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని టీజీబీ నుంచి రూ.5.45 లక్షలు, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడాలోని బ్యాంకులో రూ.7,03,500, మరో చోట రూ.11,500 డ్రా చేశారు. విచారణలో చెక్కులు ఫోర్జరీ చేసినట్లు తేలింది. తన సంతకాన్ని చెక్​ చేయకుండా నగదును బదిలీ చేసిన బ్యాంకు మేనేజర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

దీంతో వివిధ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. కాగా, డబ్బులు శ్రీధర్​బాబు దారి మళ్లించాడని అనుమానిస్తున్నప్పటికీ.. ఇందులో ఉన్నతాధికారులు, సహోద్యోగుల ప్రమేయం ఉందనే అనుమానాలున్నాయి.